ఆంధ్ర ప్రదేశ్ లో వైద్యరంగానికి సంబంధించి సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24గంటలపాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేయబోతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ తరపున ఉత్తర్వులు రాబోతున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. పేద రోగులకు నూతన సంవత్సర కానుకగా దీన్ని భావిస్తోంది ప్రభుత్వం.
ఇకపై రాష్ట్రంలోని 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఔట్ పేషెంటు సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వస్తే డాక్టర్ కు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకుంటారు. దీనికితోడు ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ప్రతి 2 వేల కుటుంబాలకు ఒక వైద్యుడు బాధ్యుడుగా ఉంటారు. కేరళ, తమిళనాడు తరహాలో ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేసే దిశగా చర్యలు పూర్తయ్యాయని చెబుతున్నారు అధికారులు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి పి.హెచ్.సి. లోనూ ఇద్దరు వైద్యులు ఉండేలా నియామకాలు పూర్తయ్యాయి. వైద్యసేవలతో పాటు రక్తపరీక్షలు కూడా అక్కడే చేసి వైద్యం చేస్తారు. రాత్రిపూట వైద్యానికి వస్తే డాక్టర్కు ఫోన్ చేస్తే వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉంటారు. ప్రాథమిక వైద్యానికి సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుతారు. ఆదివారం కాకుండా వారంలో మిగిలిన ఆరురోజులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలకు ఔట్ పేషెంటు సేవలు అందుబాటులో ఉంటాయి.
వ్యాధి తీవ్రతను బట్టి రిఫరల్ విధానం ద్వారా.. జిల్లా ప్రధాన ఆస్పత్రులకు పంపించే ఏర్పాట్లు చేస్తారు. ఈ వ్యాధులకు మందులన్నీ రోగులకు ఉచితంగా ఇస్తారు. ఇప్పటివరకు పి.హెచ్.సి. లలో ప్రాథమిక వైద్యం మాత్రమే అంటే ఎంబీబీఎస్ వైద్యుడు మాత్రమే అందుబాటులో ఉంటారు. ఇకపై 6 రకాల స్పెషాలిటీ వైద్యసేవలు, వాటికోసం స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. వారంలో ఒక్కోరోజు ఒక్కో స్పెషలిస్ట్ డాక్టర్ పి.హెచ్.సి.లలో అందుబాటులో ఉంటారు.