ఆంధ్ర ప్రదేశ్ రాజకీయంలో 2019 ఎన్నికల నాటికి ఇప్పటికీ ఒకే ఒక్క తేడా కనిపిస్తుంది. నాడు వామపక్షాలతో కలసి పోటీ చేసిన జనసేన గత ఏడాదిలో మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇక టీడీపీకి కామ్రేడ్స్ దగ్గర అవుతున్నారు కానీ బాబు మనసంతా బీజేపీ ,జనసేనల మీదనే ఉందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దారుణమైన ఫలితాన్ని చవి చూసిన టీడీపీ మళ్ళీ అలాంటి సాహసాన్ని చేయదలచుకోవడంలేదని అంటున్నారు.
జమిలి ఎన్నికలు జరగడం ఖాయమని కేంద్రం నుంచి సంకేతాలు వస్తున్న సమయంలో చంద్రబాబు ఆయన పార్టీ కూడా దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నాయి. ఏపీలో బీజేపీని పల్లెత్తు మాట అనడంలేదు సరికదా కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికీ మద్దతు ఇస్తూ బీజేపీ మనసులో చోటు కోసం వెంపర్లాడుతున్నారు. అదే విధంగా ఏపీలో జనసేన విషయంలో పవన్ కళ్యాణ్ తో చెలిమి చేసే విషయంలో కూడా టీడీపీ ఉత్సాహంగా ఉంది అంటున్నారు. పవన్ ఈ మధ్య ఏపీలో టూర్లు వేస్తే దానికి టీడీపీ అనుకూల మీడియా మంచి కవరేజి ఇవ్వడం ఇక్కడ గమనార్హం.
ఇదంతా చూస్తూంటే జమిలి ఎన్నికల నాటికి 2014 నాటి పొత్తులను ఏపీలో రిపీట్ చేయాలని చంద్రబాబు ఆలోచనగా ఉంది. వైసీపీని ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమని భావిస్తున్న చంద్రబాబు తమ మూడు పార్టీలు కలిస్తే బలమైన కూటమి ఏర్పాటు అవుతుందని, దాంతో జగన్ని గద్దె నుంచి సులువుగా దించేయగలమని ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. మరి బీజేపీ-జనసేన నాయకత్వం మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. బాబు కోరుకుంటున్నట్లుగా కరుణిస్తారో… హ్యాండ్ ఇస్తారో చూద్దాం.