Sachin Tendulkar: ఏయూ శతాబ్ది వేడుకల్లో ‘క్రికెట్ గాడ్’: సామాన్యుడిగానే వచ్చా.. కష్టపడితేనే లక్ష్యం సాధ్యం- సచిన్

Sachin Tendulkar: విద్యా కుసుమాల నిలయం, చారిత్రక ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) వందేళ్ల ప్రస్థానం అట్టహాసంగా ముగిసింది. సోమవారం ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశిష్ఠ అతిథిగా హాజరై తన ప్రసంగంతో యువతలో నూతనోత్తేజాన్ని నింపారు. ఈ వేడుకల్లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో పాటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

రెండు గదుల ఇంటి నుంచే ప్రయాణం మొదలైంది: సచిన్ తన ప్రసంగంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. “నేను కూడా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చాను. మా నాన్నగారు ప్రొఫెసర్ కావడంతో ఆయనకు చదువంటే ప్రాణం. మేమంతా రెండు గదుల ఇంట్లోనే సర్దుకునేవాళ్ళం. క్రికెట్‌లో నిలదొక్కుకున్నాకే నేను కారు కొనుక్కున్నాను,” అని సచిన్ పేర్కొన్నారు. తన తండ్రి ఏకాగ్రత గురించి వివరిస్తూ, తను కారులో పెద్దగా మ్యూజిక్ పెట్టినా, ఆయన పుస్తకం చదువుతూ ఉండేవారని, ఆ ఏకాగ్రతే తనను స్ఫూర్తినిచ్చిందని వెల్లడించారు.

కఠోర సాధనే విజయ రహస్యం యువతకు స్ఫూర్తిదాయక సందేశం ఇస్తూ సచిన్ కీలక సూచనలు చేశారు. కఠోర శ్రమ, అంకితభావం ఉంటేనే ఏదైనా సాధించగలం. పనిలో నిమగ్నమైతే బాహ్య, అంతర్గత ఒత్తిడిని సులువుగా అధిగమించవచ్చు. నెట్స్‌లో వేల గంటలు సాధన చేయడం వల్లే నేను రాణించగలిగాను. బౌలర్ ఎలాంటి బంతి వేస్తాడో ఊహించలేనట్టే, జీవితంలోనూ సవాళ్లు వస్తుంటాయి. భయాలు, అనుమానాలు వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి అని ఆయన అన్నారు.

ఈ చారిత్రక ఘట్టానికి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.

సుమారు 25,000 మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు మరియు ఉద్యోగులతో గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. వివిధ రంగాల్లో రాణించిన యూనివర్సిటీ పూర్వ విద్యార్థులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ వందేళ్ల ముగింపు వేడుక విశాఖ నగరం మరియు ఏయూ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది.

Trump Attack Incident: Sr.NTR Mallela Babji Scene Repeat? | Telugu Rajyam