పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ జిల్లా, ఈ జిల్లా అన్న తేడా లేకుండా మొత్తం ఆంధ్రపదేశ్ అంతా ఒకే వాయిస్.. అన్న చందాన వైఎస్ జగన్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు లభించింది ఓటర్ల నుంచి. దాంతో, రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారంపై జగన్ ప్రభుత్వం ఉత్సాహంగా అడుగులు ముందుకేయడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది.
కోర్టుల్లో కేసులు విచారణ దశలో వున్న నేపథ్యంలో మూడు రాజధానులన్న కోణంలో కాకుండా, ఆయా నగరాల అభివృద్ధి దిశగా మాస్టర్ ప్లాన్ అమలు చేసే పనిలో బిజీగా వుంది జగన్ ప్రభుత్వం. కర్నూలు విమానాశ్రయాన్ని వైఎస్ జగన్ ప్రారంభించాక, న్యాయ రాజధాని అంశం హాట్ టాపిక్ అయ్యింది. సుమారు 200 ఎకరాల్లో హైకోర్టుని నిర్మిస్తామని ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించిన విషయం విదితమే. మరోపక్క, విశాఖ మహా నగర విస్తరణ దిశగా ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. దాంతో, అక్కడా రాజధాని సందడి నెలకొంది.
విశాఖ, కర్నూలు మాత్రమే కాదు.. అమరావతిలోనూ పనులు వేగం పుంజుకోనున్నాయి. అమరావతి పరిధిలో పూర్తి చేయాల్సిన నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం విదితమే. పాలనలో రెండేళ్ళు దాదాపు పూర్తయిపోనున్న నేపథ్యంలో, ఇకపై అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టించాలన్నది జగన్ సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం ఏమైనా చేయగలదా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.