‘కుబేర’ సినిమా కోసం ధనుష్‌ సాహసం

ధనుష్‌, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వస్తోంది. ప్రస్తుతం ముంబయిలో శరవేగంగా షూటింగ్‌ జరుగుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ విూడియాలో తెగ షేర్‌ అవుతోంది. అది చూసిన నెటిజన్లు ధనుష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముంబయిలోని అత్యంత పెద్ద డంప్‌యార్డ్‌లో షూటింగ్‌ చేయాలని చిత్రబృందం నిర్ణయించిందట.

ఇక ఆ సన్నివేశాలు సహజంగా రావడం కోసం ధనుష్‌ 10 గంటల సేపు మాస్క్‌ కూడా లేకుండా డంప్‌యార్డ్‌లో నటించారని సినీవర్గాలు పోస్ట్‌లు పెట్టాయి. దీంతో సినిమాలపై ఆయనకున్న నిబద్ధతను నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇందులో ధనుష్‌ డీగ్లామరైజ్‌ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. నాగార్జున ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌చేయగా మంచి స్పందన వచ్చింది.

సున్నితమైన అంశాలతో, మనసుల్ని హత్తుకునేలా కథలు చెప్పడం శేఖర్‌ కమ్ముల శైలి. ‘కుబేర’తో తనదైన శైలిలో ఫిలాసఫీ చెప్పబోతున్నారు.. వాణిజ్య హంగుల్ని మేళవించి ఆయన తన మార్క్‌ కథ, కథనాల్ని తెరపై ఆవిష్కరించనున్నారు. దీంతో ఈ సినిమాలో ధనుష్‌, నాగార్జునల పాత్రలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త కాన్సెప్ట్‌తో రానున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. ఇటీవల ఈ చిత్రంపై ఆమె మాట్లాడుతూ.. ‘ఇంత మంచి ప్రాజెక్ట్‌లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ప్రస్తుతం సుదీర్ఘమైన నెట్‌ షిప్ట్‌ల్లో షూటింగ్‌ జరుగుతుంది’ అని చెప్పారు.