గజ్వేల్ లో సీన్ రివర్స్, నర్సారెడ్డి పై టిఆర్ ఎస్ వేటు

టిఆర్ ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సీఎం సొంత నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని టిఆర్ ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తూంకుంట నర్సారెడ్డి ప్రస్తుతం తెలంగాణ రోడ్ల అభివృద్ది సంస్థ చైర్మన్ గా ఉన్నారు. నర్సారెడ్డి కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని, కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతితో భేటి అయ్యారనే సమాచారంతో నర్సారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. టిఆర్ ఎస్ పార్టీ సెక్రటరీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నర్సారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు లేఖ విడుదల చేశారు.

తూంకుంట నర్పారెడ్డి కాంగ్రెస్ నుంచి టిఆర్ ఎస్ లో చేరి బలంగా పని చేశారు. గజ్వేల్ లో కేసీఆర్ గెలుపు బాధ్యతలను నర్సారెడ్డి తన భుజ స్కందాల పై వేసుకొని గెలిపించారని పలువురు అంటున్నారు. గత కొంత కాలంగా తూంకుంట నర్పారెడ్డి టిఆర్ ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు. వాస్తవానికి ఆయన కొద్దిరోజుల కిందటే కాంగ్రెస్ లో చేరనున్నారని వార్తలు వచ్చాయి. అప్పట్లోనే  పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నర్పారెడ్డి ఇంటికి వచ్చి చర్చలు జరిపారు.  విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు చర్చలు జరిపి తూంకుంట నర్పారెడ్డిని ఒప్పించారు.  

గురువారం మళ్లీ నర్సారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటి అయ్యారు. గజ్వేల్ కాంగ్రెస్ ఇంఛార్జీ వంటేరు ప్రతాపరెడ్డి కూడా ఈ భేటిలో పాల్గొన్నారు. నర్పారెడ్డికి మెదక్ ఎమ్మెల్యే లేదా ఎంపీగా అవకాశం కల్పిస్తామని అది కుదరకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ పదవినిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.  

 

ఉత్తమ్ తో సమావేశమైన నర్సారెడ్డి

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ని ఆమె నివాసంలో నర్పారెడ్డి కలిశారు. పార్టీలో చేరిన తర్వాత గజ్వేల్ లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని దానికి రావాలని విజయశాంతిని కోరారు. శుక్రవారం రాహుల్ గాంధీ సమక్షంలో నర్పారెడ్డి పార్టీలో చేరడం లాంఛనమైంది. అయితే విషయం తెలుసుకున్న కేసీఆర్ నర్పారెడ్డికి ఎమ్మెల్సీ పదవినిస్తామని హామీ ఇవ్వటంతో పార్టీలోనే నర్పారెడ్డి ఉంటారని మరికొన్ని వార్తలు కూడా వచ్చాయి.  

అటు టిఆర్ ఎస్ స్టార్ క్యాంపెయినర్ కేటిఆర్ తో ఇటు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతితో చర్చలు జరిపి ఇన్ని రోజులు నర్పారెడ్డి రెండు పడవలపై  కాళ్లు పెట్టినట్టుగా చేశారు. దీంతో పరిస్థితి గమనించిన టిఆర్ ఎస్ పార్టీ నర్పారెడ్డి పై వేటు వేసింది. నర్పారెడ్డి పై వేటు వేయడంతో పార్టీలో చర్చనీయాంశ మైంది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేతలందరిని టిఆర్ ఎస్ సస్పెండ్ చేస్తుంది.