తెలంగాణలో ఎన్నికల వేళ 119 స్థానాలకు గాను 107 స్థానాలకు టిఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. మిగిలిన 12 స్థానాలకు కూడా అభ్యర్ధులను దాదాపుగా ఖరారు చేసింది. బుధవారం లేదా గురువారంలో ఏ క్షణమైనా ఈ 12 స్థానాల అభ్యర్ధులను ప్రకటించి పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ నేతలు ప్రచారానికి దిగనున్నారు.
12 స్థానాల అభ్యర్ధులను కూడా మహాకూటమి తుది జాబితా వచ్చాక ప్రకటిద్దామనుకున్నా కూడా ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో వారిని ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ బుధవారం నామినేషన్ వేసిన అనంతరం అభ్యర్ధులను ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఈ 12 మంది అభ్యర్ధులకు కూడా కేసీఆర్ సమాచారమిచ్చారని ఏ క్షణమైనా నామినేషన్ వేసేందుకు సిద్దంగా ఉండాలని ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపినట్టు సమాచారం. ముఖ్యంగా చొప్పదండి, హూజుర్ నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక పై ఉత్కంఠ నెలకొంది.
హుజూర్ నగర్ లో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టికెట్ ఆశిస్తున్నారు. కానీ అక్కడ ఎన్ ఆర్ ఐ సైదులు రెడ్డికి టికెట్ కేటాయించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శంకరమ్మ తనకు టికెట్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ఖైరతాబాద్ నుంచి పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి టికెట్ కోరుతుండగా అక్కడ దానం నాగేందర్ కు టికెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. చొప్పదండి నుంచి బొడిగ శోభ టికెట్ ఆశిస్తుండగా అక్కడ రవిశంకర్ కు టికెట్ కేటాయించారని తెలుస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో కేసీఆర్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
