అగ్గిపెట్టె ఇండ్లు కాదు, డబుల్ బెడ్రూమ్ ల పై కేసిఆర్ కొత్త భాష్యం

2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఓట్ల వర్షం కురిపించిన పథకాల్లో ప్రధానమైనవి రెండు అందులో ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంకోటి కేజి టు పిజి ఉచిత నిర్బంధ విద్య. ఈ రెండు పథకాలు ఆచరణలో సక్సెస్ అయిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి మనవడు, ఆటో డ్రైవర్ కొడుకు ఒకే బడిలో చదివే రోజులు రావాలి అని కేసిఆర్ 2014 ఎన్నికల ముందు కామెంట్స్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైనా ఆసక్తికరంగా మాట్లాడి జనాలను ఆకట్టుకుని ఓట్లేయించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వాదనకు ఖమ్మం బహిరంగసభలో కొత్త భాష్యం చెప్పారు కేసిఆర్.

’ఇంటికి అల్లుడొస్తే ఏడ పండుకోవాలె? ఒక్క ఇంట్లో ఆడవాళ్లు చీర మార్చుకోవాలంటే ఎంత అవస్థలు, ఒక్క ఇంట్లె మేకలు ఉచ్చబోస్తే ఎట్ల ఉంటరు? అందుకోసమే రెండు బెడ్రూములు, ఒక హాలు విశాలమైన ఇల్లును ప్రభుత్వమే ఉచితంగా కట్టిస్తుంది‘‘ అని కేసిఆర్ గత ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ ఆచరణలో జరగలేదు. దీంతో తాజాగా ఖమ్మం సభలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లంటే అగ్గిపెట్టెల ఇండ్లు కాదని ప్రకటించారు. రెండు మూడు తరాలపాటు ఆ ఇంట్లో జీవనం చేసేలా కట్టిస్తామన్నారు. దానికోసం కొద్దిగా ఆలస్యమైతే కొంపలేం మునిగిపోవు కదా అని విపక్షాలపై సెటైర్స్ వేశారు.  కేసిఆర్ ఇంకేం మాట్లాడారో కింద చదవండి.  

ఖమ్మంలో పదికి పది స్థానాలు గెలుస్తాం. ఎంత మంది కుట్రలు చేసిన ఖమ్మం ప్రజల చైతన్యం ముందు అవి నిలవవన్నారు. ఖమ్మంలో తలపండిన రాజకీయ నేతలున్నారు. డిసెంబర్ 11 న ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే షాక్ తగులతదన్నారు. ప్రజలకు ఇచ్చిన 100 శాతం హామీలు అమలు చేసిన పార్టీ భారతదేశంలోనే టిఆర్ఎస్ పార్టీ అన్నారు. అవాక్కులు, చవాక్కులు చెప్తలేం … వాస్తవం మాట్లాడుతున్నామన్నారు.

డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు ఇండ్లు ఇచ్చిరా అని మాట్లాడుతున్నారు. 60 సంవత్సారాల కాలంలో పట్టిన దరిద్రాన్ని తొలగించుకుంటూ వచ్చినం. మేం కట్టే ఇండ్లు వంద శాతం సబ్సిడితో కట్టిస్తున్నామన్నారు. వాళ్లు కట్టిన ఇండ్లలా కాకుండా టిఆర్ఎస్ కడుతున్న ఇండ్లు ప్రజలందరికి ఉపయోగ పడే విధంగా ఉంటాయన్నారు. డబ్బా ఇండ్లు కట్టించి అందరి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయాలనుకోలేం. ఇంట్లో ఉంటే మహిళల గౌరవం కాపాడాలనే పక్కా ప్రణాళికతో రెండు రోజులు లేటైనా సరే మంచిగ ఉండాలని ఇండ్లు కట్టిస్తున్నామని కేసీఆర్ అన్నారు. రెండు తరాలకు ఉపయోగపడే విధంగా ఇండ్లు కట్టిస్తున్నామన్నారు.

కుల మతాలకు అతీతంగా వివక్ష లేకుండా కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చినాం. జీవితంలో కని వినీ ఊహించని విధంగా 411 పథకాలు తీసుకొచ్చినాం. భారతదేశంలోనే అత్యధిక జీతాలు తీసుకునే హోంగార్డులు, అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు ఉన్నది ఒక్క తెలంగాణలోనే ఉన్నారన్నారు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్లు ఏం చేసిర్రు అని అడుగుతున్నానన్నారు. కరెంట్ 24 గంటలు ఇచ్చిన వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఏడ పండుకున్నారన్నారు. కులం ముసుగున వచ్చే నాయకుల చెంప చెళ్లుమనిపించాలన్నారు. చంద్రబాబు ప్రచారం చేసేటప్పుడు ఎక్కడికక్కడ ప్రజలు నిలదీసి అడగాలన్నారు.

తుమ్మల నాగేశ్వరరావు మంచి డైనమిక్ మినిస్టర్ అని కేసీఆర్ పొగిడారు. కాంగ్రెస్ టిడిపి ప్రభుత్వాలు ప్రాజెక్టులను విస్మరించారు. చంద్రబాబు ఆర్డినెన్స్ కింద అన్ని ప్రాజెక్టులను దోచుకుపోయిండు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుమ్ముగూడెం, పోలవరం ప్రాజెక్టులను గుంజుకపోయిండు. ఇందిరా సాగర్ , రాజీవ్ సాగర్ ప్రాజెక్టులని పేరు పెట్టి నాశనం చేసిర్రని కేసీఆర్ విమర్శించారు.

ఈ దేశంలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంది. ఫెడరల్ ఫ్రంట్ కోసం తాను ప్రయత్నించిన.. ముందుకు పోయి విజయం సాధిస్తామన్నారు. ఢిల్లీల చక్ర తిప్పుతా.. గిక్రం తిప్పుతా అని నేను చెప్పను కానీ చేసి చూపిస్తానని కేసీఆర్ అన్నారు. ఢిల్లీని శాసించే స్థాయికి ఎదగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.