ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది టీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్సీలు, పలువురు కీలక నేతలు రాజీనామా చేశారు. తాజాగా టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో టిఆర్ఎస్ పెద్దల్లో టెన్షన్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కీలక నేతలు చేజారుతుండడంతో నేతలు తర్జన భర్జన పడుతున్నట్టు నాయకులు తెలిపారు.
సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, ఆయన భార్య సాయిలీల మాజీ మున్సిపల్ చైర్మన్ టిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. సిర్పూర్ లో సమ్మయ్య రాజీనామాతో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

రాజీనామా విషయం తెలుసుకొని సమ్మయ్య ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. సమ్మయ్య దంపతులను చూసి వారు కంటతడిపెట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్విగ్న వాతావారణం నెలకొంది.
గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్లో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి నియోజకవర్గ అభ్యర్థిని ఉద్దేశించి ప్రసంగించారు. సభకు హాజరుకావాలని కనీసం పిలుపు కూడా రాకపోవడంతో సమ్మయ్య దంపతులు తీవ్ర అవమానంగా భావించి పార్టీకి రాజీనామా చేశారు. కేసీఆర్ సభ జరిగిన కొద్ది సేపటికే సమ్మయ్య దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కావేటి సమ్మయ్య తన రాజీనామా పై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
“నన్ను పార్టీ ఘోరంగా అవమానించి.. అన్యాయం చేసినా కేసీఆర్ మీద నమ్మకంతో ఓపిక పట్టాను. కానీ కాగజ్నగర్ సభలో నాకు కనీస మర్యాద ఇవ్వలేదు. గతంలో నేనున్నాను అని హామీ ఇచ్చిన కేటీఆర్ ఫోన్ చేస్తే ఏ రోజూ లిఫ్ట్ చేయలేదు. కనీసం విషయమేంటని కూడా మాట్లాడలేదు. సిర్పూర్లో ఎవరూ దిక్కులేని సమయంలో టీఆర్ఎస్ జెండా మోయడమే మేం చేసిన తప్పా?” ఉద్యమకారులను అణిచి వేసి, ఏనాడూ పార్టీ జెండా పట్టని.. జై తెలంగాణ అని పలకని నేతలను కేసీఆర్ అందలం ఎక్కిస్తున్నారు.
పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. డబ్బులున్న వారికే విలువిస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అన్నింటిని వదులుకొని పని చేసిన వారికి విలువ లేదు. మరి కొంత మంది ముఖ్య నేతలు కూడా టిఆర్ఎస్ కు త్వరలో రాజీనామా చేస్తారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం కష్టమే.. కార్యకర్తలను, నేతలందరిని దూరం చేసుకుంటే విజయం ఎలా సాధ్యమవుతుంది” అని సమ్మయ్య అన్నారు.
సమ్మయ్య 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఏడాది వ్యవధిలోనే టిఆర్ఎస్ రాజీనామాలతో ఉపఎన్నికలు జరగ్గా మళ్లీ ఆయనే విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన కోనేరు కోనప్ప చేతిలో సమ్మయ్య ఓడిపోయారు.
2014 ఎన్నికల అనంతరం కోనప్ప టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో 2018 ఎన్నికల్లో కూడా సిర్పూర్ అభ్యర్థిగా అధిష్టానం ఆయన్నే ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి సమ్మయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన తనకు కనీస మర్యాద ఇవ్వలేదని, దీంతో పార్టీలో ఉండటం ఇష్టంలేక రాజీనామా చేస్తున్నానని సమ్మయ్య ప్రకటించారు.

టిఆర్ఎస్ కు ఇప్పటికే ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బుడాన్ బేగ్, మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, రంగారెడ్డి జిల్లా కీలక నేతలు రాజీనామా చేశారు. ఉద్యమ సమయంలో అండగా ఉన్న నేతలు పార్టీకి దూరం అవుతండడంతో నేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. కావేటి సమ్మయ్య దంపతులు ఏ పార్టీలో చేరుతారనే దాని పై భవిష్యత్తు కార్యచరణ శుక్రవారం ప్రకటించనున్నారు.
