ఎన్నికల వేళ టిఆర్ ఎస్ పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. టిఆర్ఎస్ ముఖ్య నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. టికెట్లు వస్తాయని ఆశించిన వారు తీవ్ర అసంతృప్తితో టిఆర్ఎస్ కు రాజీనామాలు చేస్తున్నారు. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామాతో టిఆర్ఎస్ లో రాజీనామాల పరంపర మొదలైంది. కేటిఆర్ కు కుడిభుజంగా ఉన్న కీలక నేత టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.
కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ , కేటిఆర్ అత్యంత సన్నిహితుడు గొట్టిముక్కల పద్మారావు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పద్మారావు అసంతృప్తిగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఆయన కూకట్ పల్లి అసెంబ్లీ నుంచి సీటును ఆశించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సీటు విషయమై కేటిఆర్ ను కలిసి విషయాన్ని చెప్పారని అయినా కూడా ఆయన నుంచి స్పందన లేదని పద్మారావు అనుచరులు తెలిపారు.

పద్మారావు కూడా చాలా ఆవేదనతో కేసీఆర్ కు లేఖ రాశారు. పార్టీలో రోజురోజుకు పరిస్థితులు దిగజారి పోతున్నాయని విమర్శించారు. చాలా అన్యాయం జరిగినా కూడా ఒపికతో సహించానని బాధతో రాజీనామా చేస్తున్నానన్నారు. ప్రజలంతా కూడా తెలంగాణ నినాదామే మర్చిపోయారని తెలంగాణలో చాలా సమస్యలున్నాయన్నారు. పార్టీ పరిస్థితిలో మార్పు రాకపోతే పార్టీ ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని ఆయన అనుచరుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. పద్మారావు లేఖలో ఏం రాశారంటే…
‘పార్టీని ఇల్లులా.. కేసీఆర్ను ఇంటి పెద్దదిక్కులా(తండ్రిలా) భావించాను. పార్టీలో ఇన్నాళ్లు చాలా మందికి అన్యాయం జరిగినా ఓపికతో సహించాను. ఇకనైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశించి ఎదురు చూశాను. అయినా.. ఎటువంటి మార్పులేదు. తెలంగాణ వాదం అనే పదాన్ని ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. మీలో మార్పు రాకపోగా.. పార్టీ పక్కదారుల పడుతోంది. ఇక పార్టీ గాడిలో పడదని భావించి పార్టీకి, కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నాన’ని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ కింద ఉంది చూడండి.

గొట్టిముక్కలది విలక్షణ శైలి
గొట్టిముక్కల పద్మారావు తన విలక్షణ శైలితో చాలా తొందరగా ముఖ్య నేతగా ఎదిగారు. పంద్రాగష్టు, రిపబ్లిక్ డే, తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఆయన విచిత్రమైన యాడ్స్ ఇచ్చేవారు. ఇండియా గాంధీ మహాత్మ గాంధీ అని, తెలంగాణ గాంధీ కేసీఆర్ అని పొగుడుతూ ఆయన యాడ్స్ ఇచ్చేవారు. పద్మారావు కూతురు యాడ్ డిజైనర్ కావడంతో ఆమె వెరైటి యాడ్స్ చేసేవారు. అలా యాడ్స్ ద్వారా ఆయన పాపులర్ అయ్యారు. కూకట్ పల్లి సీటు ఆశించి భంగపడడంతో గొట్టిముక్కల పద్మారావు రాజీనామా చేశారు.
టిఆర్ ఎస్ పార్టీలో కీలక నేతల రాజీనామాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయాన ఇతర పార్టీల నేతలను టిఆర్ఎస్ లోకి గుంజుకొని ప్రత్యర్ధి పార్టీలను దెబ్బతీయాలని చూసిన టిఆర్ఎస్ కు రివర్స్ షాక్ తగులుతుంది. సొంత పార్టీ నేతలే పార్టీ నుంచి వెళుతుంటే ఏం చేయాలో తోచని స్థితిలో టిఆర్ఎస్ నేతలున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయాన కీలక నేతలు దూరమవుతుండడంతో క్యాడర్ లో కలవరం మొదలైంది. కేసీఆర్ లో కూడా భయం మొదలైందని ప్రతిపక్ష పార్టీల వారు విమర్శిస్తున్నారు.
