షాకింగ్ న్యూస్.. కేసీఆర్ కు మరోసారి తాఖీదు

కేసీఆర్ కు ఎన్నికల కమిషన్ మరోసారి నోటిసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ప్రగతి భవన్ లో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రగతి భవన్ ని టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని ఫిర్యాదులో కాంగ్రెస్ పేర్కొంది.

ఆపధ్దర్మ ప్రభుత్వంలో ఉన్న వారికి కోడ్ నిబంధన పార్ట్ 7 వర్తిస్తుంది. దీని ప్రకారం ప్రభుత్వ అధికారిక నివాసాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించరాదు. కానీ మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డిని శుక్రవారం కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ప్రగతి భవన్ లోనే జరగింది. దీని పై కో ఆర్డినేషన్ చైర్మన్ నిరంజన్ శనివారం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఆయన ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం స్పందించకుంటే కోర్టులో కేసు వేస్తామని ఆయన ప్రకటించారు.

దీంతో ఈ అంశంపై నివేదిక ఇవ్వాల్సిందిగా సంబంధిత ఎన్నికల అదికారిని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ ఆదేశించినట్లు సమాచారం. ఆ అధికారి ఇచ్చే నివేదిక ఆధారంగా కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నట్లు తెలిసింది. సోమవారం కేసీఆర్ కు ఈసి తాఖీదులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గతంలోనే ప్రతి పక్షాల నేతలు కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ కు విరుద్దంగా సీఎం, మంత్రుల నివాసాల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , టిడిపి రమణ, సిపిఐ చాడ వెంకట్ రెడ్డి, టిజెఎస్ కపిలవాయి దిలిప్ కుమార్ లు సీఈసీ రజత్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై తక్షణమే స్పందించిన ఈసీ కేసీఆర్ కు నోటిసులు జారీ చేసింది. సరైన వివరణ లేకపోతే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది.

అసెంబ్లీ రద్దైన తర్వాత దాదాపు 10 సార్లు సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ లో సమావేశాలు నిర్వహించారని వాటి తేదిలు, సమయం, వార్త క్లిప్పింగులతో సహా నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పంపింది.

 వైపు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా నేతలు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నాయకులకు చెందిన ఫోన్లను ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారులతో ట్యాపింగ్ చేయిస్తుందని వారు ఆరోపించారు. దీని పై వివరణ కోరుతూ హోం శాఖ కార్యదర్శి, డిజిపి, ఇంటలిజెన్స్ ఐజిలకు ఎన్నికల సంఘం నోటిసులు జారీ చేసింది.  నిజంగానే ట్యాపింగ్ చేస్తున్నారా, ఎందుకోసం ట్యాపింగ్ చేస్తున్నారో అనే అంశాన్ని 24 గంటల్లో తెలియజేయాలని ఆదేశించింది.

కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటిసులు ఇచ్చినా కూడా ఆయన తన ప్రవర్తనలో మార్పు రాకపోవడం అంటే అతనికి అధికారులు ఏమైనా సహాయపడుతున్నారా అనే అనుమానాలను ప్రతిపక్ష నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కేటిఆర్ లు చట్టాలకు అతీతులా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సారి ఇచ్చే నోటిసులో కేసీఆరే స్వయంగా సమాధానం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కోరనున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ కు రెండో సారి నోటిసులు ఇవ్వనుండటంతో అంతటా హాట్ టాపిక్ అయ్యింది.