షాకింగ్ న్యూస్.. టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన కీలక నేత

అసెంబ్లీ ఎన్నికల వేళ టిఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. టిఆర్ఎస్ పార్టీకి కీలక నేతలంతా వరుస రాజీనామాలు చేస్తుండడంతో టిఆర్ఎస్ పార్టీలో గందరగోళం నెలకొంది. ఓ వైపు అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రమంతా చుట్టి వస్తుంటే రోజుకో కీలక నేత రాజీనామాలు చేస్తూ టిఆర్ ఎస్ పార్టీకి దెబ్బకొడుతున్నారు.

టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఐడిసి చైర్మన్ బుడాన్ బేగ్ టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన నిర్ణయంతో ఖమ్మం జిల్లా కార్యకర్తల్లో కలకలం రేగింది. బుడాన్ బేగ్ గత కొంత కాలంగా పార్టీ తీరు పై అసంతృప్తితో ఉంటున్నారని తెలుస్తోంది. ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని ఆయన ఆశించినట్టుగా కార్యకర్తల ద్వారా తెలుస్తోంది. దీని పై చర్చించేందుకు కేటిఆర్ అపాయిట్ మెంట్ కోరినా ఇవ్వలేదని తెలిసింది. రెండేళ్లుగా కేసీఆర్ అపాయిట్ మెంట్ ఇవ్వలేదని, కేటిఆర్ ను సంవత్సరం నుంచి అపాయిట్ మెంట్ కోరినా కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది.

బుడాన్ బేగ్

బుడాన్ బేగ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగారు.  చిన్న చిన్నగా పార్టీలో ఎదుగుతూ జిల్లా అధ్యక్షునిగా, ఐడిసి చైర్మన్ గా ఎదిగారు. క్యాడర్ ను కాపాడుకోవడంలో ఆయన విశేష కృషి చేశారని నాయకులు తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా ఉంటూ పార్టీ కార్యక్రమాలన్ని విజయవంతంగా నిర్వహించారన్నారు. తన రాజీనామా పై బేగ్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…

“టిఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి పార్టీలో కొనసాగాను. పార్టీ అభివృద్ది కోసం నిరంతరం కృషి చేశాను. పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం చాలా కష్టపడి పని చేశాను . అయినా కూడా పార్టీలో సరైన గౌరవం, గుర్తింపు లభించలేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులను మరిచిపోయారు. ఒక  నియంతలా మారిపోయారు. కేసీఆర్ పూర్తిగా బిజెపి చేతిలో కీలు బొమ్మగా మారిపోయారు. తెలంగాణలో నిజాం ప్రభువే నియంత అనుకుంటే కేసీఆర్ నయా నిజాంగా మారిపోయారు.  నియంతలా పరిపాలిస్తున్నాడు. ప్రభుత్వంలో ఆత్మగౌరవం, అభివృద్ది లేదు. కీలక నేతలను వదిలి నిన్న మొన్న వచ్చిన వాళ్లను పట్టుకొని కేసీఆర్ వేలాడుతున్నారు. త్వరలోనే పార్టీ లో విబేధాలు  తలెత్తడం ఖాయం అని బేగ్ “ అన్నారు.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కీలకంగా భావించే ఖమ్మంలో ఏకంగా జిల్లా అధ్యక్షుని రాజీనామాతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. బుడాన్‌ రాజీనామా వార్తలతో కంగుతిన్న గులాబీ అధిష్టానం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దింపి ఆయనను బుజ్జగించే  ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా బేగ్‌ టీడీపీలో చేరటం ఖాయమైంది. ఖమ్మం  అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్‌, టీడీపీ మధ్య పోరు ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌పై మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును మహాకూటమి బరిలో నిలిపింది.

నామాకు మద్దతుగా మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ప్రచారంలోకి దిగడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గ పరిధిలో మైనార్టీల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు రేణుక, నామా నాగేశ్వరరావులు చక్రం తిప్పినట్టు తెలిసింది. బేగ్ పార్టీ మారడంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.

ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ పార్టీకి నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి, రాజీనామాలు మరువక ముందే మరో సీనియర్‌ నేత పార్టీని వీడడంతో గులాబీ శ్రేణులకు మింగుడుపడడంలేదు.  గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ గాలి వీచగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక స్థానంలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. బుడాన్ బేగ్ టిడిపిలో ఎప్పుడు చేరుతారనే విషయం పై ప్రకటిస్తానని తెలిపారు.