క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా ఐపీఎల్ లవర్స్కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ ఆటగాళ్ల వేలాన్ని తిరిగి భారతదేశంలోనే నిర్వహించబోతున్నట్లు లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. గత మూడు ఎడిషన్లుగా దుబాయ్, జెడ్డా, అబుదాబి వంటి విదేశీ వేదికలపై ఈ వేలం ప్రక్రియ సాగగా, దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ స్వదేశంలో జరగబోతుండటం విశేషం.
వేలం నిర్వహణకు సంబంధించి వేదికల లభ్యత ఆధారంగా ఆతిథ్య నగరాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రతి ఏటా పెళ్లిళ్ల సీజన్ భారీగా ఉండటం వల్లే భారత్లో సరైన హోటళ్లు, వేదికలు దొరకక విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. ఈసారి జరగబోయేది మినీ వేలం కావడంతో తక్కువ సమయంలోనే ముగుస్తుందని, అందువల్ల కచ్చితంగా దేశీయంగానే వేదికను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 18న జరగబోయే బీసీసీఐ వార్షిక జనరల్ మీటింగ్ లో ఐపీఎల్ చైర్మన్గా అరుణ్ ధుమాల్ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మరోవైపు, ఐపీఎల్లో తీవ్ర వివాదాస్పదంగా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై కూడా గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి కీలక ఆటగాళ్లు ఈ రూల్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ రూల్ వల్ల ఆల్రౌండర్ల పాత్ర పూర్తిగా దెబ్బతింటోందనే వాదనల నేపథ్యంలో, ఫ్రాంచైజీల నుండి పూర్తి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే దీనిని రద్దు చేయాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని ధుమాల్ స్పష్టం చేశారు.