గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను క్లీన్గా ఊడ్చేసి, అన్న జగన్ మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.. ఇప్పుడు మళ్లీ రూట్ మార్చారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ ఈసారి ఏకంగా 10 మంది సీనియర్ నాయకులతో ‘రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీ’ని రంగంలోకి దించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్న వైసీపీ శ్రేణులకు.. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని షర్మిలమ్మ చెబుతున్న డైలాగులు వింటుంటే, “అబ్బా.. ఏం కాన్ఫిడెన్స్ తల్లి” అని సొంత పార్టీ తమ్ముళ్లే ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, సహజంగానే వచ్చే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమ ఖాతాలో వేసుకుని పుంజుకోవాలని వైసీపీ ఆశపడుతోంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే.. ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా ప్రశాంతంగా పడనీయకుండా చీల్చేయడానికి షర్మిలమ్మ తన 10 మంది మానిటరింగ్ సైన్యంతో రెడీ అయిపోయారు. అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల అమలు అంటూ జిల్లా, నగర అధ్యక్షులకు ఆమె ఇస్తున్న దిశానిర్దేశం చూస్తుంటే.. వైసీపీకి పడాల్సిన సాంప్రదాయ ఓట్లకు మళ్లీ గండి పడటం ఖాయంగా కనిపిస్తోంది. అన్నకు యాంటీగా ఉన్న ఓట్లన్నీ చేతి గుర్తుకే పడేలా షర్మిల వేస్తున్న స్కెచ్.. జగన్ క్యాంప్లో కొత్త టెన్షన్ పుట్టిస్తోంది.
గత 2024 ఎన్నికల్లో కడప లోక్సభ స్థానంలో షర్మిలమ్మ స్వయంగా నిలబడి గెలవకపోయినా.. వైసీపీకి పడాల్సిన ఓట్లను భారీగా చీల్చి అన్నకు గట్టి షాక్ ఇచ్చారు. నాటి దెబ్బతో కడప కోటలోనే వైసీపీకి కోలుకోలేని ఇబ్బంది ఎదురైంది. ఇప్పుడు అదే ఫార్ములాను గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కూడా అప్లై చేస్తే.. అసలే దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీ పరిస్థితి ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. “మాకు 100 శాతం స్ట్రైక్ రేట్ కావాలి, మెజారిటీ సీట్లు మనవే” అని షర్మిలమ్మ చెపుతుంటే.. అటు కూటమి నేతలు, ఇటు వైసీపీ నేతలు ఇద్దరూ కూడా ఈ ‘హస్తం’ హడావుడిని చూసి లోలోపల తెగ నవ్వుకుంటున్నారు.