ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎన్నో ఎండలు, వానలు చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గరివిడిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని అందరికీ నీతులు చెప్పే ఈ పెద్దాయన, తీరా తన సొంత మేనల్లుడు, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సైకిల్ ఎక్కేసి పార్టీ జంప్ కాగానే తట్టుకోలేకపోయారు. గరివిడి పార్టీ ఆఫీసులో జరిగిన ఆత్మీయ కలయిక మీటింగ్లో, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మైక్ పట్టుకుని ఉపన్యాసం ఇస్తుండగా, బొత్స మాత్రం పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ వేదికపైనే జేబులోంచి రుమాలు తీసి కన్నీళ్లు తూడ్చుకోవడం అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.
నమ్మిన వాళ్లే ఇలా కష్టకాలంలో పక్క పార్టీలోకి ప్లేటు మార్చడంపై కార్యకర్తలు సభలో ఆవేదన వ్యక్తం చేస్తుంటే, బొత్స కళ్లల్లో నీళ్లు తిరిగాయి. గతంలో మజ్జి శ్రీనుకు పార్టీలో అంత పెద్ద పీట వేయడానికి తానే కారణమని, ఇప్పుడు ఆయనే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడాన్ని బొత్స జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆ సీన్ చూస్తే అర్థమవుతోంది. ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ ఎప్పుడూ గంభీరంగా ముఖం పెట్టే బొత్స, ఇలా సెంటిమెంట్ సీన్ పండించడంతో పక్కనే ఉన్న ఆయన కుమార్తె బొత్స అనూష, ఇతర నేతలు కంగారుపడి ఓదార్చాల్సి వచ్చింది. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అన్నట్లు కాసేపటికే తేరుకున్న బొత్స, వ్యక్తులు పోయినా పార్టీ శాశ్వతం అంటూ క్యాడర్కు మళ్లీ క్లాస్ పీకడం విశేషం.