Ministers Causing Big Damage : ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఎక్కువగానే వుంది.. కానీ, ముఖ్యమంత్రి పట్ల పూర్తి స్థాయి సానుకూలత వుందన్నది వైసీపీ అంతర్గత సర్వేల్లో తేలిన అంశమంటూ ఆ మధ్య మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కష్టపడి పని చేయనివారికి 2024 ఎన్నికల్లో టిక్కెట్లు దొరకవని కూడా వైసీపీ అధిష్టానం సంకేతాలు పంపేసింది.
ఎమ్మెల్యేల సంగతి తర్వాత, బాధ్యతగల మంత్రుల పరిస్థితేంటి.? హోం మంత్రి, విద్యా శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, జల వనరుల శాఖ మంత్రి.. ఇలా కీలక మంత్రుల వ్యవహార శైలి పార్టీని నిండా ముంచేసేలా వుంది. విపక్షాల్ని విమర్శించడంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు మంత్రులు. ఆ మంత్రుల అజ్ఞానం కాస్తా మీడియా సాక్షిగానే బట్టబయలైపోతోంది.
మునుపటి మంత్రి వర్గమే కాస్తో కూస్తో బెటర్. విపక్షాల్ని విమర్శిస్తూ, ఒకింత పద్ధతిగా గత మంత్రులు వ్యవహరించేవారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు శాఖ మారాక, సీన్ మారిపోయింది. పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో ఆయన చెబుతున్న మాటలకూ, జరుగుతున్న వ్యవహారాలకు పొంతన లేదు.
మహిళలపై అఘాయిత్యాల ఎపిసోడ్లో హోంమంత్రి తానేటి వనిత వివాదాల్లోకెక్కుతున్నారు. మరో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సైతం తన శాఖ విషయంలో గందరగోళమైన ప్రకటనలు చేస్తున్నారు. కాగా, కొత్తగా మంత్రి అయిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రకటనలు పార్టీకి నష్టం కలిగించేలా వున్నాయి.
ఇలాంటి మంత్రుల టీమ్తో 2024 ఎన్నికల్ని వైఎస్ జగన్ ఫేస్ చేస్తే, ఫలితం దారుణంగా వుంటుందని వైసీపీలోనే చర్చ జరుగుతోంది.
