YSRCP Leader KK Raju: సాగర నగరం విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం మరియు సాధారణ ప్రజల సౌకర్యాలపై ‘యూజర్ ఛార్జీల’ భారం మోపడంపై వైఎస్సార్సీపీ (YSRCP) తీవ్రస్థాయిలో మండిపడుతోంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలోని స్టేడియాలు, పార్కులు, కళ్యాణ మండపాలను 99 ఏళ్ల సుదీర్ఘ లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదనలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు రోడ్డెక్కాయి.
నగరంలోని 5 కీలక స్టేడియాలు, ప్రధాన పార్కులు మరియు దాదాపు 50 కళ్యాణ మండపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రజా ఆస్తులు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని పార్టీ హెచ్చరించింది.
వాకింగ్ చేయాలన్నా రుసుము చెల్లించాలా? ముఖ్యంగా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వంటి చోట్ల వాకింగ్కు వచ్చే వారిపై సంవత్సరానికి రూ. 720 యూజర్ ఛార్జీలు విధించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
వైసీపీ హయాంలో కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన ఈ స్టేడియాలను ఇప్పుడు ఆదాయ వనరులుగా మార్చడంపై నేతలు మండిపడుతున్నారు. సామాన్యులు తమ ఆరోగ్యం కోసం చేసే వ్యాయామంపై కూడా పన్నులు వేయడం ‘నయా భారత్’లో దౌర్భాగ్యమని విమర్శించారు.
వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు నాయకత్వంలో నేడు నగరంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి ప్రజల కోసం నిర్మించిన సౌకర్యాలను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వడం ఎంతవరకు న్యాయం? వాకింగ్ చేసే వారిపై కూడా భారం వేస్తారా? ప్రభుత్వం వెంటనే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేస్తాం” అని అన్నారు.
కేవలం స్టేడియాలే కాకుండా, వివిధ క్రీడా శిక్షణ పొందే విద్యార్థులపై కూడా భారీగా ఫీజులు పెంచేందుకు జీవీఎంసీ ప్రయత్నిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఎంవీపీ కాలనీ వంటి చోట్ల స్పోర్ట్స్ ఎరీనాలను ప్రైవేటీకరించడం వల్ల సామాన్యులకు ప్రవేశం కష్టమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఈ నిర్ణయాలపై పునరాలోచన చేయాలని, ప్రజా ప్రయోజనాల కంటే ఆదాయానికే ప్రాధాన్యత ఇస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ బలంగా స్పష్టం చేసింది.

