AP Minister Kodali Nani : రామోజీకి వయసొచ్చిందిగానీ బుద్ధి రాలేదు: మంత్రి కొడాలి పవర్ పంచ్.!

AP Minister Kodali Nani : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి మీద ఎలాగైతే చెలరేగిపోతారో, ఏబీఎన్ రాధాకృష్ణ మీద కూడా అలాగే విమర్శలతో విరుచుకుపడతారు మంత్రి కొడాలి నాని. తాజాగా, ఈనాడు రామోజీరావు మీద కూడా మంత్రి కొడాలి నాని తీవ్రమైన విమర్శలు చేశారు. అది కూడా అసెంబ్లీ సాక్షిగా కావడం గమనార్హం.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కొందరు వ్యక్తులు కల్తీ మద్యం తాగి చనిపోయారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, అవి సహజ మరణాలేనని అంటోంది అధికార వైసీపీ. కాదు కాదు, కల్తీ మద్యానికి తమ కుటుంబాలు నాశనమైపోయాయని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, జంగారెడ్డిగూడెం వెళ్ళారు. మరోపక్క, అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కల్తీ మద్యం వ్యవహారంపై చర్చ జరుగుతున్న సమయంలో, మంత్రి కొడాలి నాని మాట్లాడారు. సహజ మరణాల్ని కల్తీ మద్యం మరణాలుగా టీడీపీ చూపిస్తోందని విమర్శించారు.

‘చంద్రబాబు అధికారం కోల్పోయినప్పుడే ఈనాడు రామోజీరావుకి మద్యపాన నిషేధం గుర్తుకొస్తుంది..’ అంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని.

‘రామోజీరావుకి వయసు పెరిగిందిగానీ, బుద్ధి రాలేదు..’ అంటూ కొడాలి నాని విరుచుకుపడ్డారు. ఈనాడులో వచ్చే వార్తల్ని పట్టుకుని అసెంబ్లీలో టీడీపీ శాసనసభ్యులు రాద్ధాంతం చేస్తున్నారనీ, ప్రతిపక్ష నేత అసెంబ్లీకి డుమ్మా కొట్టి పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాడంటూ చంద్రబాబుపనై విమర్శలు చేసిన కొడాలి నాని, చంద్రబాబుని ‘నీఛుడు’గా అభివర్ణించారు.