YSRCP : పవన్ కళ్యాణ్‌ని లైట్ తీసుకోవడమే వైసీపీకి మంచిదేమో.!

YSRCP : పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ ఎందుకింతలా భయపడుతోంది.? అన్న ప్రశ్నకు వైసీపీ నేతల వద్దనే సమాధానం లేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ పేరుని ప్రస్తావించకుండా ‘దత్త పుత్రుడు’ అంటూ ముఖ్యమంత్రి సెటైర్లేస్తున్న దరిమిలా, సహజంగానే వైసీపీ నేతలూ ఆ దిశగా హంగామా తీవ్రస్థాయిలో చేస్తారు, చెయ్యాలి కూడా.
కానీ, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం వల్ల వైసీపీకి లాభమేంటి.? లాభం లేదు సరికదా, వైసీపీకి నష్టం చేకూర్చుతోంది. పవన్ కళ్యాణ్ మీద అవినీతి ముద్ర వేయలేరు.
ప్యాకేజీ పేరుతో పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేసీ చేసీ వైసీపీ నాయకుల నోరు నొప్పెట్టాలి తప్ప.. ఆ ప్యాకేజీ ఆరోపణల్లో పస మాత్రం వుండదు.
చంద్రబాబుతో జనసేనాని కలిస్తే వైసీపీకి వచ్చే నష్టమేంటి.? ఏమీ లేదనే సంకేతాల్ని వైసీపీ పంపాల్సి వుంటుంది. కానీ, పవన్ – చంద్రబాబు కలిస్తే వైసీపీ ఓడిపోతుందనే సంకేతాల్ని వైసీపీ అధినాయకత్వమే నేరుగా పంపుతోంది.
దాంతో, కింది స్థాయిలో సమీకరణాలు మారిపోతాయ్. అదే జరుగుతోంది కూడా.
బీజేపీ – జనసేన ప్రస్తుతానికి రాజకీయంగా కలిసి ముందడుగు వేస్తన్నాయి. అయితే, బీజేపీతో ఎంత కాలం జనసేన కలిసి వుంటుందో చెప్పలేని పరిస్థితి. గతంలో వామపక్షాలతో కలిసి.. ఆ తర్వాత ఆ వామపక్షాలకు పవన్ హ్యాండిచ్చిన సంగతి తెలిసిందే.
ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు. టీడీపీ గడచిన మూడేళ్ళలో చాలా దారుణంగా నిర్వీర్యమైపోయింది. ఆ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా గల్లంతయ్యిందని వైసీపీనే చెబుతోంది.
అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి అదనంగా వచ్చే ఆ నాలుగైదు శాతం ఓటు బ్యాంకు వల్ల టీడీపీ పుంజుకునేదేముంటుంది.?
పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ ఎంత ఎక్కువ మాట్లాడితే, వైసీపీకి అంత నష్టం.
పైగా, పవన్ నుంచి వచ్చే సెటైర్లకు సమాధానం లేక వైసీపీ బిక్క చచ్చిపోవాల్సి వస్తోంది.! ‘రాజన్న చెత్త పుత్రుడు.. చర్లపల్లి జైలు షటిల్ టీమ్.. చంచల్ గూడా జైలు బానిస.. సీబీఐ దత్త పుత్రుడు..’ వంటివి వైసీపీని తీవ్రంగా ఇరకాటంలో పడేస్తున్నాయ్.