మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీలో అత్యంత కీలక నేతగా ఉండి, ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు భాస్కరరావు. ఇప్పుడు ఆయన కుమారుడు నాదేండ్ల మనోహర్.. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ భాస్కరరావు మరణంపై టీడీపీ నుంచి రావాల్సిన రీతిలో సంతాపం వ్యక్తం కాలేదనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలైంది!
సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు.. వారి వారి స్పందనలను సోషల్ మీడియా వేదికగానే వెళ్లడిస్తోన్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో ఆ పోస్టులనే ప్రెస్ నోట్లుగా భావించి, వార్తలు రాస్తున్నారు జర్నలిస్టులు. అయితే… టీడీపీలో మాజీ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి అయిన భాస్కరరావు మరణంపై మాత్రం ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి కానీ, ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ నుంచి కానీ ‘ఎక్స్’ లో పోస్టులు కనిపించలేదు!
పోనీ.. ఇది అప్పటి ఎన్టీఆర్ టీడీపీ కాదనో, ఇది తన టీడీపీ అనో చంద్రబాబు భావించినా.. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో ఆయన కుమారుడు మనోహర్ మంత్రిగా ఉన్నారు. సహచర మంత్రి తండ్రి చనిపోతే… “ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మనోహర్ పితృవియోగ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ” ఓ పోస్టు పెడితే ఏమైంది..? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కీలక చర్చగా మారింది!
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టే చంద్రబాబు, ప్రధానంగా నారా లోకేష్ వంటి నేతలు.. నాదెండ్ల భాస్కరరావు విషయంలో అనుసరించిన వైఖరి సరైంది కాదనే చర్చా జరుగుతుంది! పైగా… ఆయన మరణ వార్త వచ్చి సుమారు నాలుగైదు గంటలు అయినప్పుడు కూడా.. చంద్రబాబు, లోకేష్ తదితర టీడీపీ నేతలెవరూ ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్లు గుంభనం పాటించడం గమనార్హం!
వాస్తవానికి… 1984లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లినప్పుడు ఆయన్ను పదవీచ్యుతుణ్ని చేశారు భాస్కరరావు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దన్నుతో 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. చంద్రబాబు & కో దృష్టిలో అది భాస్కరరావు చేసిన తప్పే అవ్వొచ్చు.. అలా అనుకుంటే 1995 ఆగస్టులో చంద్రబాబు & కో చేసిందేమిటి అనే ప్రశ్నా వస్తోంది కదా..?
వీటన్నింటికీ… వ్యక్తిగత కారణాలు, రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలు, నాటి పరిస్థితులు.. వంటివి ఏమైనా సమాధానాలు కావొచ్చు!
ఒక్కమాటలో చెప్పాలంటే… రాజకీయాల్లో అవసరాలు, అవకాశాలే ఉంటాయి తప్ప… బాగా నమ్మిన స్నేహితుడు, పిల్లనిచ్చిన మామగారు, కష్టాల్లో ఆదుకున్న సహచరుడు వంటి డైలాగులకు చోటు ఉండటం మెజారిటీ సందర్భాల్లో ఆల్ మోస్ట్ అసాధ్యం!
కానీ… అవి చావులో కూడా పరిగణలోకి తీసుకుంటారా.. వాటిని చనిపోయిన వ్యక్తి విషయంలోనూ పట్టించుకుని, పంతాలకుపోతారా..?
ఇలా చాలామంది భావిస్తారనో ఏమో కానీ… ఓ వర్గం మీడియాలో దీనిపై ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి! ఇందులో భాగంగా… సీఎం చంద్రబాబు భాస్కరరావు మృతికి సంతాపం తెలిపారని, లోకేష్ విచారం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి! అయితే… ఇవన్నీ ఎక్కడుండి చేశారనేది వెల్లడి కాలేదు! ఎందుకంటే.. హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే భాస్కరరావు స్వగృహం ఉంది!
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి, వైఎస్ విజయమ్మ జన్మదినం గుర్తుపెట్టుకుని, సోషల్ మీడియా వేదికగా గౌరవంతో కూడిన శుభాకాంక్షలు చెప్పిన నారా లోకేష్ కు… తాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పార్టీలోని ఒకప్పటి కీలక నేత, తాను కీలక మంత్రిగా ఉన్న ప్రభుత్వంలో సహచర మంత్రి తండ్రి మరణించిన విషయంపై ఆన్ లైన్ వేదికగా ఒక్క పోస్టు పెట్టకపోవడం చాలా దారుణమని అంటున్నారు జనసైనికులు!
నాదేండ్ల భాస్కరరావు మరణం విషయంలో చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతల తీరు ఇలా ఉంటే… జనసేన అధినేత మాత్రం అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆన్ లైన్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా… శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నానని.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని.. నాదెండ్ల భాస్కరరావు గారు 70వ దశకం నుంచి ప్రజా జీవితంలో ఉన్నారని.. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయనకున్న పరిజ్ఞానం ఎంతో విలువైనదని పవన్ ‘ఎక్స్’ వేదికగా రాసుకొచ్చారు.
ఇదే సమయంలో.. విజయవాడ ఈస్ట్, వేమూరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా, ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచి సేవలందించారని కొనియాడుతూ… నాదెండ్ల భాస్కరరావు గారి కుమారుడు, నా సహచర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు పితృ వియోగం బాధ నుంచి త్వరగా కోలుకోవాలని పవన్ స్పందించారు. మనోహర్ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు చెప్పారు.
అంతే కాదు… “పార్టీ పీఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారైన, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు నాదెండ్ల భాస్కర రావు గారి మరణం బాధాకరం. ఆయన మృతి పట్ల జనసేన పార్టీ తరపున తీవ్ర సంతాపం తెలియజేస్తూ, మనోహర్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము” అని ఆ పార్టీ ‘ఎక్స్’ వేదికగా స్పందించింది.
దీంతో… ఇదే రీతిలో అటు చంద్రబాబు, లోకేష్, టీడీపీ పార్టీల అకౌంట్స్ నుంచి స్పందన వచ్చి ఉంటే బాగుండేదని.. రాష్ట్రంలో పలు చోట్ల “కూటమిలో కుమ్ములాటలు” అనే కథనాలొస్తోన్న వేళ.. టీడీపీ నుంచి వచ్చే స్పందన కూటమి ఐకమత్యానికి మరో సాక్ష్యంగా నిలిచేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
