ఏపీ మంత్రి కొడాలి నాని కొంచెం ఆవేశపరుడు. ఒక్కోసారి తొందపడి ఏదేదో మాట్లాడేస్తుంటారు. అది ఏకంగా వైఎస్ జగన్ కే తలనొప్పిని తీసుకొస్తుంది. ఇదివరకు కూడా ఇలాగే సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈసారి ఏకంగా ఏపీ రాజధాని అమరావతి మీదనే ఆయన వ్యాఖ్యానించారు. అమరావతిలో శాసన రాజధాని కూడా అవసరం లేదంటూ తేల్చిచెప్పారు. ఆయన అన్న మాటలు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.
అమరావతిలో శాసన రాజధాని అవసరం లేదు. అమరావతిలోనే దాన్ని పెట్టాల్సిన అవసరం ఏం లేదు. అమరావతిలో పేదలకు స్థానం లేదు. పేదలకు స్థానం లేని అమరావతి శాసన రాజధానిగా ఎలా పనికివస్తుంది.. అంటూ ఏదేదో మాట్లాడారు నాని.
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలన్నది ప్రభుత్వం సంకల్పం. దాన్ని ఎలాగైనా చేసి తీరతాం. ఒకవేళ అమరావతిలో ఆ పని కుదరదు.. అంటే అది ప్రజలకు ఉపయోగం లేనట్టే. అమరావతి ప్రజలకు ఉపయోగపడనప్పుడు అదే అమరావతిలో చట్టాలు చేసే అసెంబ్లీ మాత్రం ఎందుకు దండగ.. అంటూ నాని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు చాలవా.. అమరావతి నుంచి క్యాపిటల్ ను తరలించేస్తున్నారు అనడానికి. ఇప్పటికే ఏపీ ప్రజలు అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ ధర్నాలు చేస్తున్నారు. కానీ.. అమరావతి నుంచి క్యాపిటల్ ను తరలించడానికి వైసీపీ నాయకులు బాగానే పాటుపడుతున్నారు.. అంటూ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇక ఎవరి పేరు చెప్పి అసెంబ్లీని అమరావతి నుంచి తరలించాలని అనుకున్నారో కానీ.. పేదల పేరుతో మాత్రం అసెంబ్లీని అక్కడి నుంచి తరలించడానికి వైసీపీ ప్రయత్నిస్తున్నట్టు నాని మాటల్లోనే తెలిసిపోతోంది.
నిజానికి అమరావతిలో ఉన్న రైతుల్లో దాదాపు అందరూ పేద రైతులే. ఎకరాలకు ఎకరాలు ఎవ్వరికీ అక్కడ లేవు. పావు ఎకరం, అర ఎకరం.. ఉన్నవాళ్లు కోటీశ్వరులు ఎలా అవుతారు. ఓ ప్రాంతం మీద ఇంతలా ఎందుకు ద్వేషం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏం సాధిస్తారు.. అంటూ ఏపీ ప్రజలు మండిపడుతున్నట్టు సమాచారం.