Pawan Kalyan: తమది ‘పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం’ అని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామం నందిగరువులో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మాట-మంతి’ కార్యక్రమంలో గిరిజనులతో నేరుగా ముచ్చటించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితిని మార్చి, ప్రభుత్వ యంత్రాంగమే నేరుగా ప్రజల వద్దకు వచ్చేలా పాలనను ప్రక్షాళన చేశామని తెలిపారు. “మీరు కష్టాలు చెప్పుకోవడానికి రోడ్ల మీదకు రాకముందే, వాటిని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని గిరిజనులకు భరోసా ఇచ్చారు.

ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కుంటుపడటానికి గత ప్రభుత్వ నిధుల మళ్లింపే కారణమని పవన్ ఆరోపించారు. ఈ పథకంలో సుమారు రూ. 4 వేల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఏజెన్సీ ప్రాంతాల్లో 460 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించినట్లు వెల్లడించారు. గిరి శిఖర గ్రామాల్లో గర్భిణీలు ఎదుర్కొంటున్న డోలీ కష్టాలను శాశ్వతంగా తొలగించడమే లక్ష్యమని, కేవలం 40 గడపలున్న నందిగరువు గ్రామానికి రూ. 2 కోట్లతో రోడ్డు నిర్మించామని గుర్తుచేశారు.
“లక్షలాది మంది మధ్య ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం కంటే, 70 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేని మారుమూల గ్రామంలో మీ మధ్య ఉండటం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తోంది.” – పవన్ కల్యాణ్
ఎన్నికల్లో ఓట్లు వేశారా లేదా అన్న వివక్ష తమ ప్రభుత్వంలో ఉండదని పవన్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో కూటమి అభ్యర్థులు గెలవకపోయినా, అభివృద్ధిలో మాత్రం వెనుకడుగు వేయబోమని హామీ ఇచ్చారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు రావడానికి నాయకులు భయపడతారేమో కానీ, ప్రజల కోసం పనిచేసే తనకు ఎలాంటి భయం లేదని ధీమా వ్యక్తం చేశారు.

‘మాట-మంతి’ కార్యక్రమంలో గ్రామస్థులు కోరిన పలు సమస్యలపై డిప్యూటీ సీఎం తక్షణమే స్పందించారు:
ఓనూరు పాఠశాల: తక్షణ మరమ్మతులకు ఆదేశం.
కొత్తపొలం గ్రామం: 1.6 కి.మీ. మేర కొత్త రోడ్డు మంజూరు.
పెండింగ్ పనులు: అసంపూర్తిగా ఉన్న పాఠశాల, అంగన్వాడీ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
గిరిజనుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా, ప్రకృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి చేసి చూపిస్తామని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

