Free Bus Travel: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. దివ్యాంగుల చిరకాల స్వప్నమైన ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ‘దివ్యాంగ శక్తి’ పేరుతో రూపొందించిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు బస్టాండ్ ఆవరణలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం రాయితీ పొందుతున్న దివ్యాంగులకు, ఇకపై ఐదు రకాల బస్సుల్లో పూర్తి ఉచితంగా (Zero Fare) ప్రయాణించే అవకాశం కల్పించారు.
పల్లె వెలుగు
అల్ట్రా పల్లె వెలుగు
సిటీ ఆర్డినరీ
మెట్రో ఎక్స్ప్రెస్
ఎక్స్ప్రెస్ బస్సులు
గమనిక: నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్ప్రెస్ వంటి లగ్జరీ బస్సుల్లో మాత్రం పాత పద్ధతిలోనే 50 శాతం రాయితీ కొనసాగుతుంది.
పాస్ పొందే విధానం.. ఎక్కడ? ఎలా?: ఈ పథకం కింద ప్రయాణించడానికి దివ్యాంగులు తప్పనిసరిగా బస్ పాస్ కలిగి ఉండాలి. దీని కోసం ఆర్టీసీ మూడు రకాల మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.

ఆర్టీసీ కౌంటర్లు: నేటి నుంచే రాష్ట్రవ్యాప్తగా ఉన్న ఆర్టీసీ కౌంటర్లలో పాస్లు జారీ చేస్తున్నారు. సదరం (SADAREM) సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో వెళ్తే వెంటనే పాస్ పొందవచ్చు.
మొబైల్ యాప్: APSRTC అధికారిక యాప్ ద్వారా సదరం ఐడీ నమోదు చేసి, నామమాత్రపు ఫీజు చెల్లించి డిజిటల్ పాస్ పొందవచ్చు.
వాట్సప్ గవర్నెన్స్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనమిత్ర’ వాట్సప్ సేవ ద్వారా కూడా డిజిటల్ పాస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్య గమనిక: పాత రాయితీ పాస్లు ఉన్నవారు వాటి గడువు ముగిసేవరకు కొత్త పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాత పాస్తోనే ఉచిత ప్రయాణం చేయవచ్చు. అయితే డిజిటల్ పాస్ ఉన్నవారు ప్రయాణ సమయంలో ఒరిజినల్ సదరం సర్టిఫికెట్ వెంట ఉంచుకోవాలి.
అర్హతలు మరియు నిబంధనలు:
వైకల్యం శాతం: 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
సహాయకులు (Escort): 100 శాతం అంధత్వం ఉన్నవారు లేదా 69 శాతానికి పైగా శారీరక/మానసిక వైకల్యం ఉన్నవారి వెంట వచ్చే ఒక సహాయకుడికి బస్ ఛార్జీలో 50 శాతం రాయితీ లభిస్తుంది.
గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉచిత బస్సు ప్రయాణ హామీని ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, అతి తక్కువ కాలంలోనే సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసి ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని పట్టాలెక్కిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

