కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. ఉన్నత స్థాయికి రావాలని కలలు కన్నా : చిరంజీవి

తెలుగు డిజిటల్‌ విూడియా ఫెడరేషన్‌ వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి నటుడు విజయ్‌ దేవరకొండ గెస్ట్‌లుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. కెరీర్‌లో ఆయన ఎదుర్కొన్న విమర్శలు, కుటుంబం గురించి పలు ప్రశ్నలు అడిగారు. దీనికి చిరు ఆసక్తికర జవాబిలిచ్చారు. కెరీర్‌ పరంగా ఈ స్థాయికి రావాలని ఎన్నో కలలు కన్నా.

అయితే ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్టార్‌డమ్‌ ఒక్కరోజులో మొదలైంది కాదు, ఒక్క రోజులో వచ్చింది కాదు. స్కూల్‌, కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేవాడిని. అప్పట్లో బెస్ట్‌ యాక్టర్‌గా అవార్డు అందుకున్న రోజులున్నాయి. తోటి విద్యార్థులు నాపై ప్రశంసలు కురిపించేవారు. వారి మాటలు విని నేనెంతో గర్వపడేవాడిని. నటుడిగా మారాలనే బీజం అప్పుడే పడింది. సెలబ్రిటీ అయితే అందరూ మనల్నే చూస్తారని అర్థమైంది. దాని కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు అడుగులు వేశా. నా ఎదుగుదల వెనుక కష్టంతో పాటు జయాపజయాలు, విమర్శలు ఇలా చాలానే ఉన్నాయి. అవన్నీ దాటుకుని ఇప్పుడు ఈ హోదాలో ఉన్నా. కెరీర్‌లో తొలి అడుగులు వేసే సమయంలో.. మనం రాణించగలమా? లేదా అని బిక్కుబిక్కుమని ఉంటాం. అలాంటి సమయంలో సానుకూల వాతావరణం ఉన్న చోటే ఉండాలి.

నేను అప్పటికి సినిమాల్లోకి రాలేదు. మద్రాస్‌లో ఉన్నప్పుడు స్నేహితుడితో కలిసి పాండిబజార్‌ వెళ్లా. అక్కడి వాళ్లు నన్ను చూసి.. ఏంటి సినిమాల్లో చేయడానికి వచ్చావా? హీరో అవుతావా?అని హేళన చేశారు. వాళ్ల మాటలు విని ఎంతో బాధపడ్డా. ఆ సంఘటన తర్వాత నేను మళ్లీ అక్కడికి వెళ్లలేదు. నెగెటివిటీ ఉన్న చోటికి వెళ్తే మనం మరింత కుంగుబాటుకు గురి అవుతాం. నా కుటుంబానికి నాన్నే ఫ్యామిలీస్టార్‌. ఒక కుటుంబాన్ని ఎలా చూసుకోవాలనే దాన్ని ఆయన నుంచే నేర్చుకున్నా. మా అమ్మకు ఐదుగురు చెల్లెళ్లు. మా తాతయ్య చనిపోయాక.. నాన్నే వారి బాధ్యత తీసుకుని వచ్చిన జీతంలోనే వారికి పెళ్లిళ్లు చేశారు. మా కుటుంబంలో ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా.. పలు సందర్భాల్లో అందరూ ఒకచోట కలిసేలా నేనూ సురేఖ ప్లాన్ చేస్తుంటాం.

అలా కలవడం వల్ల మనలో ఉండే చిన్న చిన్న మనస్పర్ధలు తొలిగిపోతాయని మా నమ్మకం. నేను మనసుకి ఆహ్లాదానిచ్చే చిత్రాలు చూస్తుంటా. చెబితే నవ్వుతారు కానీ.. నాకు ‘మిక్కీ హౌస్‌’ కామిక్‌ చిత్రాలు చూస్తా. జాకీ చాన్‌ చిత్రాలను ఎక్కువగా చూస్తాను.మా ఇంట్లో వాళ్లు గదుల్లో లైట్స్‌ అన్ని ఆన్‌ చేసి వెళ్లిపోతుంటారు. నేనే వాటిని ఆఫ్‌ చేస్తుంటా. వేడి నీళ్ల కోసం గిజర్‌ ఆన్‌ మర్చిపోతారు. వీటన్నింటికి సంబంధించి నా ఫోన్‌లో యాప్‌ పెట్టుకున్నా. చరణ్‌ ఉదయాన్నే బ్యాంకాక్‌ వెళ్లాడు. తన ప్లోర్‌లో లైట్స్‌ అన్ని వేసి వెళ్లిపోయాడు. వాటన్నింటినీ నేను వెళ్లి ఆఫ్‌ చేశా. షాంపూ అయిపోతే ఆ బాటిల్‌లో నీళ్లు పోసి వాడుతుంటా. సోప్‌ చివరకు వచ్చాక.. చిన్న చిన్న ముక్కలన్నింటినీ ఒకటిగా చేసి వాడుతుంటా. దీన్నే మధ్యతరగతి మెంటాలిటీ అంటారు. మనిషికి పొదుపు చేయడం చాలా అవసరం అంటూ సరదాగా చెప్పేశారు.