మహిళల ఆసియా కప్ 2026 (Women’s Asia Cup 2026) టోర్నమెంట్లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్లో మైదానంలో దురుసుగా ప్రవర్తించిన పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) గట్టి షాక్ ఇచ్చింది. భారత ఓపెనర్ షెఫాలీ వర్మను అవుట్ చేసిన తర్వాత ఫాతిమా సనా మితిమీరిన సైగలు చేస్తూ, అసభ్యకరమైన రీతిలో సెండ్-ఆఫ్ ఇచ్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లోని లెవెల్ 1 నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఫాతిమా సనా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఆర్టికల్ 2.5ను ఫాతిమా సనా ఉల్లంఘించినట్లు మ్యాచ్ రెఫరీలు నిర్ధారించారు. అంతర్జాతీయ మ్యాచ్లలో ఒక బ్యాటర్ అవుట్ అయినప్పుడు వారిని రెచ్చగొట్టేలా లేదా దూషించేలా సైగలు చేయడం, కామెంట్లు చేయడం ఈ నిబంధన కింద నేరంగా పరిగణించబడుతుంది. మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఫాతిమా సనా డిసిప్లినరీ రికార్డులో ఒక డెమెరిట్ పాయింట్ను కూడా ఐసీసీ యాడ్ చేసింది. గత 24 నెలల కాలంలో ఆమెకు ఇది రెండవ తప్పు కావడంతో ఆమె ఖాతాలో మొత్తం డెమెరిట్ పాయింట్ల సంఖ్య రెండుకు చేరింది.
గతేడాది ఆగస్టులో ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా ఆమె మొదటి డెమెరిట్ పాయింట్ పొందింది. ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ మ్యాచ్ రెఫరీ సుప్రియా రాణి దాస్ ప్రతిపాదించిన ఈ శిక్షను పాక్ కెప్టెన్ ఫాతిమా సనా అంగీకరించడంతో ఎలాంటి అధికారిక విచారణ అవసరం లేకుండానే ఈ నిర్ణయాన్ని ఖరారు చేశారు. ఐసీసీ రూల్స్ ప్రకారం ఏదైనా ఆటగాడు 24 నెలల వ్యవధిలో 4 లేదా అంతకంటే ఎక్కువ డెమెరిట్ పాయింట్లు సాధిస్తే, అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారి సదరు ప్లేయర్పై ఒకటి లేదా రెండు మ్యాచ్ల పాటు నిషేధం పడే అవకాశం ఉంటుంది. భారత్పై గెలవాలనే కసితో మైదానంలో అత్యుత్సాహం ప్రదర్శించిన పాక్ కెప్టెన్కు ఐసీసీ ఇచ్చిన ఈ షాక్ క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.