అమ్మ పదవి లేపేసి.. అమెరికా టికెట్ బుక్ చేసుకుందా..?

తెలంగాణ కాంగ్రెస్‌లో నిన్నమొన్నటి దాకా మంత్రిగా ఒక వెలుగు వెలిగిన కొండా సురేఖ పదవి ఎలా ఊడిందో అందరికీ తెలిసిందే. అయితే బయట ఎంత రచ్చ జరిగినా, ఈ వ్యవహారంలో అసలు విలన్ మాత్రం సొంత కూతురేనంటూ వరంగల్ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు తెగ నవ్వుకుంటున్నారు. కూతురు కొండా సుస్మితా పటేల్ సోషల్ మీడియాలో చూపించిన అత్యుత్సాహం, కాంగ్రెస్ పెద్దలపై చేసిన వివాదాస్పద కామెంట్లు చివరకు తల్లి మంత్రి పదవిని నడిరోడ్డుపై పడేశాయనే టాక్ నడుస్తోంది.

ఎంతో కష్టపడి తెచ్చుకున్న మంత్రి పదవి ఇలా మధ్యలోనే ఊడిపోయేసరికి, కొండా నివాసంలో ఇప్పుడు రోజువారీ సీరియల్స్ రేంజ్‌లో గొడవలు జరుగుతున్నాయట. అసలు విషయానికొస్తే.. వచ్చే ఎన్నికల్లో పరకాల సీటు తనదే అని ఫిక్స్ అయిన సుస్మిత, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడాన్ని అస్సలు తట్టుకోలేకపోయింది. అహం దెబ్బతిని “నన్నే కాదంటారా?” అంటూ నేరుగా సీఎం రేవంత్ రెడ్డికే సోషల్ మీడియాలో ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. “నాతో పోటీ చేసి గెలువు” అంటూ ఆమె చూపించిన దూకుడుకు అధిష్ఠానానికి ఎక్కడో కాలింది.

ఫలితంగా కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు రావడం, ఆమె “నా కూతురు మాటలకు నాకు సంబంధం లేదు” అని చేతులు ఎత్తేసినా.. చివరకు మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి రేవంత్ రెడ్డి గట్టి షాకే ఇచ్చారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించిన ఇమేజ్‌ను కూతురు తన నోటి దురదతో ఒకే ఒక్క వారంలో బూడిద చేసేసరికి కొండా మురళి, సురేఖ ఇద్దరూ ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇంట్లో పొద్దున లేస్తే ఇదే రచ్చ సాగుతుండటంతో.. తట్టుకోలేకపోయిన సుస్మిత, కొన్నాళ్ల పాటు వరంగల్ గాలి పడకుండా అమెరికాకు చెక్కేయాలని ప్లాన్ చేసుకుందట. ఇక్కడ వాతావరణం కూల్ అయ్యేదాకా.. అంటే అమ్మకు మళ్లీ ఏదైనా పదవి వచ్చేదాకా లేదా తానే కొత్త పార్టీ పెట్టేంత సీన్ వచ్చేదాకా అమెరికాలో ఉండి సేదతీరాలని భావిస్తోందట. చూస్తుంటే “తల్లి తింటే అరిటాకు.. కూతురు తింటే విస్తరాకు” అనే సామెత కొండా ఫ్యామిలీకి పక్కాగా సెట్ అయినట్టుంది.