బాబోరితో రేవంతు పోటీ, పెద్ద జాక్ పాట్ కొట్టాడులే..!

రాజకీయాల్లో గురువును మించిన శిష్యుడు అనిపించుకోవాలని ప్రతీ ఒక్కరూ ఆరాటపడటం సహజమే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అదే హైటెక్ పంథాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడి గారి గైడెన్స్‌లో పాలిటిక్స్ నేర్చుకున్న రేవంతన్న, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక తన పొలిటికల్ గురువు మార్క్ ఐటీ అండ్ హైటెక్ విజన్‌ను సరిగ్గా పుణికిపుచ్చుకున్నట్లున్నారు. నాడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటా సెంటర్లు, మైక్రోసాఫ్ట్ అంటూ గ్లోబల్ బిల్డప్ ఇస్తే.. ఇప్పుడు శిష్యుడు ఏకంగా దేశంలోనే అతిపెద్ద ‘AI డేటా సెంటర్’ కోసం టీసీఎస్ సంస్థతో రూ. 70 వేల కోట్ల భారీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అమరావతి, ఐటీ ప్రాజెక్టులు అంటూ బిజీగా ఉంటే.. ఇటు రేవంతన్న కూడా ఏమాత్రం తగ్గనంటూ టాటా ప్రతినిధులతో వరుస మీటింగులు పెట్టేశారు. ఫలితంగా టీసీఎస్ అనుబంధ సంస్థ ‘హైపర్‌వాల్ట్’ హైదరాబాద్‌లో ఏకంగా 250 ఎకరాల విస్తీర్ణంలో భారీ క్యాంపస్ పెట్టేందుకు సైన్ చేసేసింది. ఒక గిగావాట్ సామర్థ్యంతో రాబోతున్న ఈ ఏఐ డేటా సెంటర్ లెక్కలు చూసి పక్క రాష్ట్రాల లీడర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ‘బాబుగారూ.. మీరు ఐటీతో హైటెక్ సిటీ కడితే.. నేను ఏఐతో ఫ్యూచర్ సిటీ కడతా’ అన్నట్లుగా రేవంతన్న ఈ 70 వేల కోట్ల డీల్‌తో గ్లోబల్ రేంజ్‌లో స్కెచ్ వేశారు.

ఈ మెగా ప్రాజెక్ట్ పుణ్యమా అని దాదాపు 7 వేల మంది ఐటీ బాబులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయట. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సరిగ్గా 2028 జూన్ 2 నాటికి డెడ్‌లైన్ కూడా పెట్టేసి లీడర్లు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు, ఫ్యూచర్ సిటీని కలిపే స్పెషల్ రోడ్డుకు ఏకంగా ‘రతన్ టాటా’ పేరు పెడుతున్నట్లు ప్రకటించి టాటా గ్రూప్‌ను కూడా ప్రసన్నం చేసుకున్నారు. ఒకప్పుడు బాబుగారు సైబర్ టవర్స్ గ్రాఫిక్స్ చూపిస్తూ ఐటీ హబ్ అన్నట్లు.. ఇప్పుడు రేవంతన్న ఏఐ డేటా సెంటర్ మ్యాప్‌లు పట్టుకుని భాగ్యనగరంలో నయా హైటెక్ లీడర్‌గా కనిపిస్తున్నారు. మరి శిష్యుడి ఏఐ స్పీడ్‌కు కౌంటర్‌గా గురువుగారు అమరావతి నుంచి ఎలాంటి గ్లోబల్ ప్లాన్‌తో వస్తారో చూడాలి.