అమెరికా – ఇరాన్ మధ్య పాకిస్థాన్ వేదికగా జరగనున్న శాంతి చర్చల వ్యవహారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆసక్తికర అంశంగా మారింది. ఈ క్రమంలో… ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్ కు బయలుదేరగా.. మరోవైపు ఇరాన్ బృందం ఇప్పటికే పాక్ చేరుకుంది. మరోవైపు లెబనాన్ పై గ్యాప్ లేకుండా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో… ఇప్పుడు ఈ నాలుగు దేశాల మధ్య “నమ్మకం” అనే అంశం అత్యంత కీలకంగా మారింది.
అవును… అమెరికా – ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం అటు పశ్చిమాసియా, ఇటు తూర్పు ఆసియా ప్రాంతాల్లోని దేశాలను వణికించేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం పుణ్యమాని హార్మూజ్ జలసంధి నుంచి నౌకల ప్రయాణం సమస్యగా మారిన వేళ.. తూర్పు ఆసియా దేశాల్లో ఇంధన సమస్యలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇక గల్ఫ్ దేశాల పరిస్థితి వర్ణనాతీతం అనే చెప్పాలి. ఆ దేశాలు గతంలో ఎన్నడూ చూడని సరికొత్త సమస్యలను చవి చూస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో… ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ లో జరగనున్న శాంతి చర్చల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా స్పందించిన ఘాలిబఫ్… యూఎస్ పై తమకు మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ నమ్మకం మాత్రం లేదని అన్నారు. ఈ సందర్భంగా యూఎస్ తో గతంలో ఎదురైన అనుభవాలను గురించి ప్రస్తావించిన ఆయన.. నాడు రెండుసార్లు చర్చలు జరుగుతుండగానే తమపై దాడికి పాల్పడ్డారని అన్నారు.
మరోవైపు ఇస్లామాబాద్ లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు సర్వం సన్నద్ధమైన వేళ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశానికి రక్షణ మంత్రి అయిన ఖవాజా… మానవాళికి ఇజ్రాయెల్ ఒక శాపం వంటిదని.. గాజా, ఇరాన్ లలో తీవ్ర విధ్వంసానికి పాల్పడిన టెల్ అవీవ్.. ఇప్పుడు లెబనాన్ లోనూ రక్తపాతం సృష్టిస్తోందని ఎక్స్ వేదికగా స్పందించారు. దీంతో.. పాక్ వ్యవహార శైలిపై తమకు నమ్మకం లేదని.. ఖవాజా తమ దేశ నాశనాన్ని కోరుకోవడం అత్యంత దారుణమని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది.
అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ వేదికగా జరగనున్న శాంతి చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… తాము చర్చల కోసం ఎదురుచూస్తున్నామని.. అవి సానుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నామని.. ఇరాన్ నేతలు చిత్తశుద్ధితో చర్చలకు సిద్ధంగా ఉంటే తాము కచ్చితంగా సహకారం అందిస్తామని.. ఒకవేళ వారు తమతో ఆడుకోవాలని చూస్తే తమ బృందం నుంచి రియాక్షన్ కూడా అలానే ఉంటుందని హెచ్చరించారు.
సరిగ్గా గమనిస్తే.. ఉగ్రవాదులకు పుట్టినిళ్లు లాంటి పాకిస్థాన్ లో అమెరికా – ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగాలని నిర్ణయించడమే ఓ షాకింగ్ విషయం అని అనుకుంటుంటే… ఇక్కడ ఇజ్రాయెల్ కు పాక్ పై నమ్మకం లేదు.. ఇరాన్ కు అమెరికాపై నమ్మకం లేదు.. ఇదే క్రమంలో అమెరికా వైఖరిపై ఇరాన్ కు నమ్మకం కనిపించడం లేదు.. మరోవైపు పాక్ మధ్యవర్తిత్వం, శాంతి చర్చలపై మిగిలిన పశ్చిమాసియా, తూర్పు ఆసియా దేశాలకూ నమ్మకం లేదని అంటున్నారు. అంటే.. ఇన్ని అపనమ్మకాల మధ్య మొదలవ్వబోతున్న శాంతి చర్చలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేదే ఇప్పుడు ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న అంశం.
మరి… ఈ నాలుగు దేశాలకు ఒకరిపై ఒకరికి లేని నమ్మకం.. శాంతి చర్చలను ఫలింపచేస్తుందా.. లేక, మూడో ప్రపంచ యుద్ధానికి మరింతగా మార్గం సుగమం చేస్తుందా అనేది వేచి చూడాలి.
