కూతురి పెళ్లి.. కోర్టు గొడవలు.. అన్న జగన్‌కు షర్మిల ‘ఇన్విటేషన్’ ఇస్తుందా..?

ఏపీ కాంగ్రెస్ బాస్ వైఎస్ షర్మిల ఇంట కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ నిశ్చయంతో మళ్లీ పెళ్లి బాజాలు మోగడానికి టైమ్ ఫిక్స్ అయింది. అమెరికాలో సెటిల్ అయిన రాయలసీమ డాక్టర్‌తో అంజిలి రెడ్డి ఏడడుగులు వేయబోతున్నట్లు షర్మిలమ్మ సోషల్ మీడియాలో సంతోషంగా ప్రకటించేశారు. అయితే ఈ హ్యాపీ న్యూస్ బయటకు రాగానే బెజవాడ టీ స్టాళ్ల నుంచి తాడేపల్లి ప్యాలెస్ దాకా ఒకటే వెటకారపు చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా ఆస్తుల పంపకాల కోసం కోర్టుల్లో ఈకలు పీక్కుంటూ, కన్నెత్తి చూసుకోని రేంజ్‌లో ఉన్న సొంత అన్న, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ పెళ్లి పత్రిక అందుతుందా? లేదా? అనేదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో బిగ్గెస్ట్ కామెడీ సస్పెన్స్.

గతంలో కొడుకు రాజారెడ్డి పెళ్లి జరిగినప్పుడు షర్మిలమ్మ తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి మరీ అన్న జగన్ చేతిలో పెళ్లి పత్రిక పెట్టి.. ‘అన్నా.. రా’ అని పిలిచారు. జగన్ కూడా పెద్ద మనిషిలా వచ్చి కొత్త జంటకు బొకే ఇచ్చి ఆశీర్వదించారు. కానీ, కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం సితారలా మారిపోయింది. గత కొన్ని నెలలుగా వైఎస్సార్ ఆస్తుల కోసం అన్నాచెల్లెళ్లు రోడ్డుకెక్కి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా ఎన్‌సీఎల్‌టీ కోర్టుల దాకా వెళ్లి షర్మిలపై జగన్ లీగల్ నోటీసులు ఇవ్వడం, దానికి కౌంటర్‌గా జగన్ బెంగళూరు ప్యాలెస్‌ను, సరస్వతి పవర్ షేర్లను లాగుతూ షర్మిలమ్మ ఘాటు లేఖలతో సాగించిన ‘కథ, స్క్రీన్‌ప్లే’ ఏపీ ప్రజలకు మంచి పొలిటికల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చింది.

‘మా మధ్య రక్త సంబంధాలు లేవు.. కేవలం లీగల్ సంబంధాలే’ అనే రేంజ్‌లో విమర్శలు నడిచాయి. ఇలాంటి అత్యంత క్లిష్టమైన ‘యుద్ధ’ వాతావరణంలో కూతురి పెళ్లికి జగన్ గారికి ఇన్విటేషన్ పంపడం షర్మిలమ్మ ఈగో ఒప్పుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ షర్మిల పిలవాలని అనుకున్నా.. ‘నా షేర్లు నాకు ఇవ్వకుండా నీ పెళ్లికి ఎలా వస్తా?’ అని జగన్ గారు అనుకుంటారేమోనని కాంగ్రెస్ శ్రేణులు నవ్వుకుంటున్నాయి. లేదు.. ఇంట్లో జరిగే పెద్ద శుభకార్యం కాబట్టి మధ్యలో తల్లి వైఎస్ విజయమ్మ ఎంట్రీ ఇచ్చి, తాడేపల్లికి వెళ్లి.. ‘ఆస్తుల గొడవలు తర్వాత చూసుకోవచ్చు.. ముందు చెల్లెలి కూతురి పెళ్లికి రా’ అని జగన్ గారిని ఒప్పించేందుకు రాయబారం నడుపుతుందా అని వైఎస్సార్ అభిమానులు ఆశపడుతున్నారు.

ఒకవేళ విజయమ్మ రాయబారంతో ఆహ్వాన పత్రిక వెళ్లినా.. జగన్ చెల్లెలి ఇంటి పెళ్లికి వస్తారా, లేదా కేవలం ట్విట్టర్‌లో ఒక ‘కంగ్రాట్స్’ పోస్ట్ పెట్టి సరిపెట్టుకుంటారా అనేది మిస్టరీ. గతంలో కొడుకు పెళ్లికి సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను ప్రత్యేకంగా పిలిచి జగన్ కు షాక్ ఇచ్చిన షర్మిలమ్మ.. ఈసారి కూడా కూటమి పెద్దలందరినీ ఫ్రంట్ రోలో కూర్చోబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందే.. అన్న జగన్ కూడా వచ్చి చెల్లెలి కూతురి పెళ్లిలో సందడి చేస్తారా? లేక ఈ పెళ్లి వేడుక వైఎస్ ఫ్యామిలీలోని ఆస్తుల గ్యాప్‌ను ప్రపంచానికి మరింత వెటకారంగా చూపిస్తుందా? అనేది చూడాలి.