డిప్యూటీ సీఎం గారి కోపం ఖరీదు రూ. 21 కోట్లు..!

రాజమహేంద్రవరంలోని ప్రఖ్యాత ‘ఆంధ్రా పేపర్ లిమిటెడ్’ యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి, పవిత్ర గోదావరి నదిలోకి యథేచ్ఛగా కెమికల్ వ్యర్థాలను వదిలేస్తున్నందుకు గాను ఏకంగా రూ. 21.1 కోట్ల భారీ జరిమానా విధిస్తూ పిసిబి కొరడా ఝుళిపించింది. అయితే, ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే.. “ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి క్లాస్ పీకినా మీరు లైట్ తీసుకుంటారా? అయితే ఈ కోపం ఖరీదు రూ. 21 కోట్లు.. కట్టేయండి మరి” అన్నట్లుగా సాగడం ఇప్పుడు ఏపీ పొలిటికల్ అండ్ బిజినెస్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

అసలు కథ ఏంటంటే.. గత మే 26న ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తూర్పులంక పరిసర ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. గోదావరి నదిలో పేరుకుపోయిన ఇసుక మేటలు, ఫ్యాక్టరీల నుంచి వస్తున్న విష వ్యర్థాలను చూసి ఆయనకు ఎక్కడో కాలింది. గోదావరిని కాలుష్య కోరల్లోకి నెడుతున్న కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. “లోపాలు తక్షణమే సరిదిద్దుకోవాలి, పర్యావరణ నిబంధనలు పాటించాల్సిందే” అంటూ పవన్ కళ్యాణ్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో గానీ, పాలిటిక్స్‌లో గానీ పవన్ కళ్యాణ్ కోపానికి ఒక రేటింగ్ ఉంటుంది. కానీ, పేపర్ మిల్ యాజమాన్యం మాత్రం.. “ఆయనొచ్చారు.. చూశారు.. చెప్పారు.. మనకెందుకులే” అన్నట్లు డిప్యూటీ సీఎం మాటలను చాలా లైట్‌గా తీసుకుని లోపాలు సరిదిద్దడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు.

కాలుష్య నియంత్రణ మండలి గతంలో ఈ పేపర్ మిల్‌కు పదేపదే నోటీసులు ఇస్తూనే ఉంది. డిప్యూటీ సీఎం విజిట్ తర్వాత కూడా వీరు తమ పాత నైజాన్ని మార్చుకోకుండా గోదావరి నది పర్యావరణాన్ని చెడగొడుతూనే వచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ శాఖ అయిన పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి అఫిషియల్‌గా రంగంలోకి దిగి.. డిప్యూటీ సీఎం మాటను బేఖాతరు చేసినందుకు రూ. 21.1 కోట్ల భారీ పెనాల్టీతో గట్టిగా బుద్ధి చెప్పింది. నిబంధనలు మార్చకపోతే ఫ్యాక్టరీకి తాళాలు పడతాయనే రేంజ్‌లో కఠిన సంకేతాలు పంపింది. మరి ఇప్పటికైనా ఈ 21 కోట్ల దెబ్బతో పేపర్ మిల్ యాజమాన్యం దారికొస్తుందో లేదో చూడాలి.