తెలుగు రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చాలా మంది సీనియర్ రాజకీయ నేతలకు పెద్ద పరీక్షగా మారింది. ఏళ్ల తరబడి జెండాలు మోసి, పార్టీల కోసం కోర్టుల చుట్టూ తిరిగిన తమ్ముళ్లు, హస్తం నేతలు పదవుల కోసం ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని వేచి చూస్తున్నారు. కానీ, ఈ లోపే సెలబ్రిటీ కోటాలో మెగా ఫ్యామిలీకి మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ పదవుల జాతర ఏకధాటిగా సాగిపోతుండటం బ్యూరోక్రాటిక్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.
తాజాగా విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలను దేవాదాయ శాఖ నియమించింది. కేవలం సినిమా కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ రంగంలో మాత్రమే అనుభవం ఉన్న సుస్మిత.. ఇప్పుడు ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధిపై ఎలాంటి ‘మెగా’ సలహాలు ఇస్తారనేది భక్తులకు ఆసక్తికరమైన విషయమే. నిజానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మెగా ఫ్యామిలీకి ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే.. రాజకీయాల్లో కష్టపడటం కంటే సెలబ్రిటీ స్టేటస్ ఉండటమే నామినేటెడ్ పదవులకు అసలైన క్వాలిఫికేషన్ ఏమో అనే సందేహం సామాన్య కార్యకర్తలకు రాక మానదు.
మొన్నటికి మొన్న తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు పదవి దక్కింది. ఇప్పుడు ఏపీలో ఇంద్రకీలాద్రిపై సుస్మితకు చోటు దక్కింది. అంటే రెండు రాష్ట్రాల్లోని ప్రధానమైన కొండల పైన దైవకార్యాల బోర్డులలో మెగా ఫ్యామిలీకి స్థానాలు పక్కాగా రిజర్వ్ అయిపోయాయన్నమాట. సినిమా ఇండస్ట్రీ సమస్యల కోసం గతంలో ప్రభుత్వాల చుట్టూ తిరిగిన రోజులు పోయి, ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ మారగానే ఆధ్యాత్మిక బోర్డులు కూడా ఇలా మెగామయం కావడం విశేషం.
ఆంధ్రప్రదేశ్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చూస్తుంటే.. మరో సోదరుడు కొణిదెల నాగబాబుకు ఆల్రెడీ ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. ఇప్పుడు తాజాగా అన్నయ్య కుమార్తె సుస్మితకు కూడా దుర్గగుడి బోర్డులో ప్రత్యేక స్థానం కల్పించడంతో కుటుంబ కోటా వంద శాతానికి చేరినట్లయింది. కూటమి కోసం రాత్రింబగళ్లు కష్టపడిన క్షేత్రస్థాయి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పదవుల లిస్టుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే.. ఇలాంటి విఐపి ఫ్యామిలీలకు మాత్రం ఎక్కడా ఆలస్యం లేకుండా జీవోలు జారీ అయిపోతుండటం పట్ల అంతర్గతంగా కొంత వెటకారపు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, పార్టీ కోసం జెండాలు మోసే వారి కంటే.. గ్లామర్, పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్న వారికే నామినేటెడ్ పదవుల రేసులో ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని ఈ వరుస నియామకాలు మరోసారి నిరూపించాయి.