బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముచ్చట ఇంకా అఫీషియల్గా బయటకు రాలేదు కానీ, అప్పుడే ‘మేయర్’ పీఠం కోసం కూటమి తమ్ముళ్ల మధ్య అసలు సిసలైన లొల్లి పీక్స్కు చేరింది. దానికి తోడు మన కూటమి సర్కార్ ఈసారి కౌన్సిలర్ల కొనుగోళ్లకు బ్రేక్ వేస్తూ.. ‘మేయర్ ఎన్నిక డైరెక్ట్ అంటే ప్రజలే ఓట్లేయాలి’ అని అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడంతో కథ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సిటీ మొత్తం తిరిగి ఓట్లు రాబట్టే సత్తా మాకంటే మాకుంది అంటూ లీడర్లు రడీ అయిపోవడంతో బెజవాడలో పొలిటికల్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది.
మొన్నటిదాకా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ గారు తన వారసుడు బొండా సిద్ధార్థ్ బయోడేటాను చంద్రబాబుగారి చేతిలో పెట్టి.. ‘బాబుగారు మా అబ్బాయికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు’ అంటూ బెజవాడలో ఫుల్ పబ్లిసిటీ చేసుకున్నారు. ఐదేళ్ల పాటు జెండా మోశాం కాబట్టి సీటు మాదే అని బొండా క్యాంప్ ధీమాగా ఉంది. కానీ కట్ చేస్తే, సీన్లోకి సడన్గా వంగవీటి రాధాకృష్ణ పేరు రావడంతో బొండా క్యాంప్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నగరవ్యాప్తంగా రంగా గారి ఇమేజ్, మాస్ ఓట్లు పడాలంటే రాధానే కరెక్ట్ అని బాబుగారు ఆలోచిస్తున్నారట.
ఎప్పుడో సీజనల్ స్టార్లా మెరిసే రాధా గారి ఎంట్రీతో బొండా తమ్ముళ్లకు అప్పుడే చెమటలు పడుతున్నాయి. ఇక ఈ పచ్చ చొక్కాల కొట్లాట చాలదన్నట్టు మధ్యలో జనసేన తమ్ముళ్లు ఎంట్రీ ఇచ్చి రచ్చను మరింత రసవత్తరంగా మార్చేశారు. “బెజవాడలో గ్లాస్ గుర్తు క్రేజ్ మామూలుగా లేదు.. పొత్తులో భాగంగా ఈ మేయర్ సీటు మాకే కేటాయించాలి” అంటూ జనసైనికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క బొండా కొడుకు లాయల్టీ సెంటిమెంట్, మరోపక్క రాధా గారి మాస్ క్రేజ్, ఇంకోపక్క జనసేన సీట్ల లొల్లి.. ఇలా ముగ్గురు మూడు పక్కల నుంచి లాగుతుంటే అధిష్ఠానానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరి ఈ ముక్కోణపు కొట్లాటలో చివరికి మేయర్ కుర్చీ ఎవరికి దక్కుతుందో, బాబుగారు ఎవరి నెత్తిన పాలు పోస్తారో చూడాలి.