అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం సక్సెస్ రేట్తో ఊపుమీదున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి గట్టి టాస్కే ఇచ్చారు. “రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడానికి మేమే కదా మెయిన్ రీజన్.. మరి ఆ మాత్రం వాటా ఇవ్వకపోతే ఎలా..?” అన్నట్లుగా కీలక నగరాల మేయర్ పీఠాలపై కన్నేశారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి హాట్ సీట్లను తమకే కేటాయించాలని జనసేన డిమాండ్ చేస్తుండటంతో, గెలిచిన ఆనందంలో ఉన్న టీడీపీ తమ్ముళ్లకు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి.
ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో టీడీపీకి భారీ మెజారిటీలతో గెలిచిన ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్ స్థానాలతో పాటు మెజారిటీ అసెంబ్లీ సీట్లను కూడా సైకిల్ పార్టీయే క్లీన్ స్వీప్ చేసింది. తీరా చూస్తే ఇప్పుడు జనసేన ఏమో.. “ఎంపీ సీట్లు మీవి కావచ్చు బాస్.. కానీ మేయర్ పీఠాలు మాత్రం మాకే కావాలి” అని పట్టుబడుతోంది. ఎంతో కష్టపడి నగరాల్లో జెండా పాతిన స్థానిక టీడీపీ నేతలకు, ఇప్పుడు చేతికి వచ్చిన మేయర్ పదవులను వేరే వాళ్లకు ఎలా వదులుకోవాలో అర్థం కాక లోలోపల తెగ మదనపడిపోతున్నారు.
ఇక ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కూడా జనసేన మేయర్ స్థానాన్ని అస్సలు వదిలేలా లేదు. ఎలాగూ తిరుపతి అసెంబ్లీ సీటులో జనసేన అభ్యర్థే గెలిచారు కాబట్టి, అక్కడ మేయర్ సీటుపై తమకు ఫుల్ రైట్స్ ఉన్నాయని జనసేన కేడర్ గట్టిగా నమ్ముతోంది. ఇప్పుడు ఈ మూడు కీలక నగరాల మేయర్ స్థానాలను అడుగుతున్న పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి. ఒకటి నీకు.. ఒకటి నాకు అంటూ బాబుగారు వేసే కొత్త ఫార్ములాకు తమ్ముళ్లు ఎంతవరకు తల ఊపుతారో వేచి చూడాల్సిందే.