బొండా కొడుకు లొల్లిపై కేశినేని చిన్ని ‘సెటైరికల్’ కన్ఫర్మేషన్..

బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముచ్చట ఇంకా అఫీషియల్‌గా బయటకు రాలేదు కానీ, అప్పుడే ‘మేయర్’ కుర్చీ కోసం పచ్చ చొక్కాల మధ్య అసలు సిసలైన కొట్లాట పీక్స్‌కు చేరింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ తన వారసుడు బొండా సిద్ధార్థ్ బయోడేటాను చంద్రబాబుగారి చేతిలో పెట్టి.. ‘బాబుగారు మా అబ్బాయికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు’ అంటూ ప్రచారం చేసుకోవడంపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన మార్క్ స్టైల్‌లో సెటైరికల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. బొండా ఉమ తన కొడుకు కోసం టికెట్ అడుగుతున్న మాట వాస్తవమేనని చెప్తూనే, అక్కడ సీన్ ఇంకోలా ఉందంటూ లీకులు ఇచ్చారు.

ఎంపీ కేశినేని చిన్ని మాటల ప్రకారం చూస్తే బెజవాడ మేయర్ కుర్చీ కోసం తమ్ముళ్ల మధ్య లాఠీచార్జ్ రేంజ్‌లో కాంపిటీషన్ నడుస్తోంది. “ఆయన కొడుకు కోసం ఆయన అడగడంలో తప్పు లేదు కానీ.. ఇక్కడ ఒక్క మేయర్ సీటు కోసం పార్టీలో ఏకంగా 15 మందికి పైగా క్యూలో ఉన్నారు” అంటూ చిన్ని బెజవాడ పాలిటిక్స్ లోని అసలు గుట్టు విప్పారు. అంటే బొండా క్యాంప్ అనుకుంటున్నట్లుగా టికెట్ అంత ఈజీగా దక్కేలా లేదు. మున్సిపల్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరగనుండటంతో, సిటీ మొత్తం తిరిగి ఓట్లు రాబట్టే సత్తా మాకంటే మాకుంది అంటూ 15 మంది లీడర్లు చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట.

ఇక ఇంతమంది ముగ్గురు మూడు పక్కల నుంచి లాగుతుంటే ఈ లొల్లిని తేల్చడం ఎవరి తరం కాదని ఎంపీ చిన్ని తేల్చేశారు. “మేయర్ సీటులో ఎవరిని కూర్చోబెట్టాలి.. ఎవరికి టికెట్ ఇస్తే సేఫ్ అనే విషయాన్ని మన పొలిటికల్ మాస్టర్ మైండ్ చంద్రబాబు నాయుడే స్వయంగా సమీక్షించి ఫైనల్ చేస్తారు” అని సెలవిచ్చారు. ఇదే గ్యాప్‌లో తనపై వస్తున్న రూమర్లకు కూడా చిన్ని గట్టిగానే పంచ్ వేశారు. ఈ అంతర్గత కొట్లాటలు తట్టుకోలేక మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని తాను చంద్రబాబును కోరినట్లు వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదని, అవన్నీ ప్యూర్ అవాస్తవాలని కొట్టిపారేశారు. మరి ఈ 15 మంది ముక్కోణపు కొట్లాటలో చివరికి మేయర్ కుర్చీ ఎవరికి దక్కుతుందో, బాబు ఎవరి నెత్తిన పాలు పోస్తారో చూడాలి.