ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు సినిమాల్లో సూపర్ ఇమేజ్ ఉంది. ఇక అదే ఇమేజ్ రాజకీయాల్లో కొనసాగుతుంది. కాకపోతే ఆ ఇమేజ్ ఓట్ల రూపంలో రావడం లేదు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రావడంలో పవన్ కల్యాణ్ పాత్ర చాలావరకు ఉంది. అప్పుడు వైసీపీ-టీడీపీలు పోటాపోటిగా ఉన్నాయి. గెలుపు ఎవరనేది అంచనాకు కూడా రాలేదు.
అదే సమయంలో పవన్ టీడీపీకి మద్ధతు ఇవ్వడం బాగా ప్లస్ అయింది. ఆయన సామాజికవర్గమైన కాపులు ఎక్కువ సంఖ్యలో టీడీపీకి ఓట్లు వేశారు. ఫలితంగా చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన సపోర్ట్తో మార్జిన్లో గెలిచేశారు. ఫలితంగా టీడీపీ మేజిక్ ఫిగర్ దాటేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ మొదట్లో బాగానే మద్ధతు ఇచ్చారు.
అలాగే ఏమన్నా ప్రజలకు ఇబ్బంది కలిగే నిర్ణయాలు తీసుకుంటే వాటి గురించి చంద్రబాబుతో చర్చించి మళ్ళీ ఆలోచించుకునేలా చేశారు. ఇక టీడీపీ అవినీతి రాను రాను పెరిగిపోతుండటంతో పవన్, చంద్రబాబుతో విభేదించి బయటకొచ్చి, ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే బీజేపీని కూడా గట్టిగానే టార్గెట్ చేసి ముందుకెళ్లారు. ఇక అప్పటివరకూ ప్రజలు పవన్కు గట్టిగానే సపోర్ట్ ఇచ్చినట్లు కనిపించింది.
కానీ ఆ సపోర్ట్ 2019 ఎన్నికల్లో కనిపించలేదు. పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. జనసేన ఒక్కటే సీటు గెలుచుకుంది. ఈ ఫలితం తర్వాత పవన్ దూకుడు పెంచి రాజకీయాల్లో మరింత యాక్టివ్ అవ్వాల్సింది. కానీ ఆ పని చేయలేదు. మళ్ళీ ఎప్పటిలాగానే సినిమాలు తీయడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు రాజకీయం చేస్తూ వచ్చారు. కాకపోతే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, పవన్ ఏదైనా సమస్యపై పోరాడితే మంచి ఫలితం వస్తుంది. జనం కూడా మద్ధతు ఉంటారు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా గుడివాడలో పేకాట అంశం. కానీ ఇబ్బందికరమైన విషయం ఏంటంటే పవన్ సినిమా రాజకీయాలు చేస్తుండటమే కార్యకర్తలకి మరియు అభిమానులకి నచట్లేదని సమాచారం.