కొండా సురేఖకు టికెట్ ఎందుకు రాలేదు?

(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)

కొండా సురేఖ టిఆర్ ఎస్ నాయకత్వానికి అల్టిమేటమ్ జారీ చేస్తూ తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని, లేకపోతే,  తనకు తెలిసిన విషయాలను బహిరంగ లేఖ ద్వారా రచ్చ రచ్చ చేసి టిఆర్ ఎస్ నుంచి  వెళ్లిపోతానని చెప్పారు.  టిఆర్ఎస్ తో సంబంధం తెంచుకునేందుకే ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి రాజీకి వీలు లేకుండా చెప్పాల్సిన వన్నీ చెప్పారు. ఆమెకు టికెట్ ఇవ్వకపోవడం వెనక రాజకీయం అందరికి తెలిసిందే. కొండా సురేఖ తెలంగాణ రాజకీయాలలో చాలా తొందరగా పేరు తెచ్చుకున్న మహిళ. బాగా మాట్లాడగలిగిన నాయకురాలు. ఆత్మవిశ్వాసం దండిగా ఉన్న మహిళ. సమస్యల మీద స్పష్టమయిన అవగాహన ఉంది. ఆమె ప్రసంగాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. అందుల్ గ్యాస్,గాసిప్ ఉండవు.  అవకాశం ఇస్తే ఏ బాధ్యతనయిన చక్కగా నిర్వర్తించగలిగే శక్తి  ఆమెకు ఉంది. ఆమె అణగిమణగి వుండే బాపతు కాదు. స్వతహాగ శక్తి వంతురాలయినపుడు అలా ఉండలేరు.

తెలంగాణ  నుంచి మహిళా ముఖ్యమంత్రి అయ్యే అర్హతలున్న నలుగురైదుగురు మహిళల పేర్లు చెప్పమంటే, అందులో కచ్చితంగా కొండాసురేఖ పేరు ఉండి తీరుతుంది. 

 కాబట్టి, కెసిఆర్ లాంటి నాయకుడు ఆమెను ఎమ్మెల్యే స్థాయికి మించి ప్రోత్సహించడం కష్టం. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అంతకు మించి అక్కడ ఆశించిడం కూడా సాధ్యం కాదు.

రాజకీయ నాయకులు చెప్పే అబద్దపు హామీలనుంచి విద్యచ్ఛక్తి తీసే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల పార్టీనేతలు ఇచ్చే హామీలతో రెండు రాష్ట్రాలలోనివినియోగదారులందరికి 24X7 ఉచిత విద్యుత్ సరఫరా చేయవచ్చు.  కెసిఆర్ చెప్పే మాటలు ఈ కోవలోకే వస్తాయి. నమ్మించడంలో ఆయనకుఉన్న శక్తి అపారం. తాను పొద్దనే ఛీఫ్ ఎలెక్షన్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడానని వందల మంది విలేకరులను ఆయన నమ్మించారు.

కొండాసురేఖ టిఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నపుడు జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ చెప్పిన విషయాలు అందరికీ గుర్తుంటాయి. ఆమె ఎన్నికల్లో గెలుస్తుందని, ఆమె టెక్స్ టైల్ మంత్రి అవుతుందని కూడా చెప్పారు.  ఇది ఆయన చేసే వందల వేల హామీలలో ఇదొకటి.  ఈ హమీ నెరవేర్చ లేదు. దీని వెనక కారణాలు వూహించవచ్చు. తెలంగాణ రాష్ట్రసమితిలో కొండాసురేఖ లాంటి ఇండిపెండింట్ స్వభావం ఉన్న లీడర్లకు స్థానం ఉండదు.  బాగా గొంతు వుండి, వాగ్ధాటి ఉన్న నాయకులను టిఆర్ ఎస్ లోకి వస్తూనే మూగవోతారు. ఉదాహరణకు కె కెశవరావు  గొంతు ఎపుడూ వినిపించదు. ఆయన నలభైయేళ్ల రాజకీయమంతా  వాయిస్ వల్లే నడిచింది. ఆయనకిపుడు మాట పడిపోయింది. సభలో కెసిఆర్ పక్కసీటుతో ఆయన సంతృప్తి పడుతుంటారు.  టిఆర్ ఎస్ చేరి పదవి వచ్చినందుకు నోరు మూసుకోవలసివ చ్చింది. ఇదే డి శ్రీనివాస్ కు వర్తిస్తుంది. చాలామంది కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ టిఆర్ ఎస్ చేరి అడ్రసులేకుండా పోయారు. ఇలా టిఆర్ ఎస్  రాజకీయాల్లో ఉనికి ని మాయం చేసుకోవాలి. సొంత గుర్తింపుతీసేసుకుని టిఆర్ ఎస్ , కెసిఆర్ ల గుర్తింపుతోనే ఉండాలి. కెసిఆర్ నాలుగేళ్ల రాజకీయాలను జాగ్రత్త గా పరిశీలిస్తే, పార్టీ , ప్రభుత్వం తరఫున గ్లామరస్ గా కనిపించేది ముగ్గురే- ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటి మంత్రి కెటిఆర్, నిజాంబాద్ ఎంపి కవిత.  వీళ్ల  విజిబిలిటి గమనిస్తే, వీళ్లు తప్ప పార్టీలో మరొకరికి ప్రాముఖ్యంలేదని చెప్పవచ్చు. మిగతావాళ్లంతా చీర్ లీడర్లే.

ఇలా సొంత ఉనికిని  వదలుకుని ముగ్గురునేతల పార్టీకి తన వ్యక్తిత్వాన్ని సబార్డినేట్ చేస్తే టిఆర్ఎస్ లో  కొండాసురేఖకు ఫ్యూచర్ ఉంటుంది. (ఇది అన్ని ప్రాంతీయ పార్టీలకు వర్తిస్తుంది.) లేకపోతే, ఎవరైనా కొండా సురేఖలవుతారు.

కొండాసురేఖతో సమస్య ఏమిటంటే… ఆమె విజయవంతమయిన పొలిటిషియన్. ఆమెను మంత్రిని చేస్తే, ఆమె స్టేచర్ పెరుగుతుంది. పవర్ కారిడార్స్ లో కవిత కాకుండా మరొక మహిళ స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఇది కెసిఆర్ కు నచ్చలేదు.  కొండాసురేఖ కెపాసిటీ కెసిఆర్ కు బాగా తెలుసు. ఆమెకు మంత్రి పదవి ఇస్తే తీగెలా అల్లుకు పోతుంది. ఆమెతరఫున, భర్త తరుఫున రెండు బిసి కులాలున్నాయి. రెండుకులాలను ఆమె సొంతంచేసుకుంటే ఆమె  ప్రాబల్యం బాగా పెరుగుతుంది. ఇలా ఒక పరాయి  మహిళ తెలంగాణలో తయారు కావడం ఏ ప్రాంతీయ పార్టీనేతకు ఇష్టం ఉండదు.  అంతే. సింపుల్ గా ఆయన హామీ వదిలేశారు.  కొండా సురేఖను మంత్రి చేయలేదు.  మరొకరిని చేస్తే అపవాదు వస్తుంది కాబట్టి, అసలు మహిళా క్యాబినెట్ మంత్రే లేకుండా ముఖ్యమంత్రి కెసిఆర్  ప్రభుత్వం నడిపారు.

ధైర్యం, స్థైర్యం ఉన్న మహిళలకు ప్రాంతీయ పార్టీలు పనికిరావు. కష్టాలొచ్చినా,నష్టాలొచ్చినా, జాతీయ పార్టీలోనే ఉండాలి. లేదా స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఇంట్లో బీరువాలో దాచిపెట్టి  పార్టీ గుంపులో కలపిపోవాలి.

ఇపుడు కెసిఆర్ వారసత్వాన్ని కొడుకు కెటిఆర్ కు అప్పగిస్తున్నారని చెబుతున్నారు. అలాంటపుడు కెటిఆర్ కు అనుకూలమయిన వాతావరణం ఏర్పరచాలి.  కొండాసురేఖ పేరు 105 పేర్లలో కనిపించకపోవడంలో ఇందులో భాగమే.

‘కేసీఆర్‌ మాట విని ఆ రోజు నేను పరకాల నియోజకవర్గం వదులుకున్నాను.  వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి మారాను.  వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో 50 వేల మెజార్టీ సాధించాను. అయినా నాకు టికెట్‌ ఎందుకు ఇవ్వలేదు. నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేసినా ఏ రోజూ నేను మాట్లాడలేదు. గత నాలుగేళ్లుగా వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశా. ఈ నాలుగేళ్లలో నేను చేసిన తప్పేంటో చెప్పాలి’. అని కొండా సురేఖ అడుగుతున్నారు. టికెట్  ఎందుకివ్వలేదో అందరిక ంటే బాగా ఆమెకే తెలుసు.