టిఆర్ఎస్ పార్టీ నుంచి నలుగురు కీలక నేతలను బహిష్కరిస్తూ టిఆర్ఎస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని క్రమశిక్షణా చర్యల కింద నలుగురు నేతలను బహిష్కరించినట్టు ప్రకటించింది. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలల్లో అసెంబ్లీ సీటు ఆశించిన వారు సీటు రాకపోవడంతో రెబల్ గా పోటి చేస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్నసమయంలో రెబల్స్ గా మారిన పార్టీ నేతలను బహిష్కరిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.
బహిష్కరణకు గురైన వారిలో…
బెల్లంపల్లి నుంచి వినోద్ (వీ6 అధినేత వివేక్ సోదరుడు)
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గజ్జెల నగేశ్,
షాద్ నగర్ నుంచి శంకర్,
మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి ఉన్నారు.
వివేక్ సోదరుడు వినోద్. వీరిద్దరు కూడా వెంకటస్వామి కుమారులు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరు 2014 ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ లో చేరారు. వినోద్ కు పార్టీలో తగిన ప్రాధాన్యతనిస్తామని చెప్పినా ఇప్పటి వరకు తనను పట్టించుకోలేదనే ఆవేదనలో వినోద్ ఉన్నట్టు తెలుస్తోంది. వినోద్ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేశారు. మాజీ మంత్రి అయినప్పటికి కూడా తనకు పార్టీలో ప్రాధాన్యత లేదని తన అనుచరుల వద్ద వాపోయారు.

వినోద్ పార్టీ మారుతారని తెలిసి మంత్రి కేటిఆర్ వినోద్ తో చర్చలు జరిపారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే సీటు కావాలని కోరినప్పటికి సీట్ల కేటాయింపు జరిగిపోవడంతో కేటాయించలేమని కేటిఆర్ చెప్పారు. అయినా కూడా వినోద్ వెనుకకు తగ్గలేదు. చెన్నూరు నుంచి వినోద్ పోటి చేస్తారని అంతా అనుకున్నారు కానీ బెల్లంపల్లి నుంచే టిఆర్ఎస్ రెబల్ గా వినోద్ బరిలో నిలిచారు. వినోద్ సోదరుడు వివేక్ మాత్రం టిఆర్ఎస్ లో నే ఉన్నారు. పార్టీ క్రమశిక్షణ చర్యలకింద వినోద్ ను బహిష్కరిస్తూ టిఆర్ఎస్ ఉత్తర్వులు జారీ చేసింది.

కంటోన్మెంట్ నుంచి గజ్జెల నగేష్ రెబల్ గా బరిలోకి దిగారు. కంటోన్మెంట్ టిఆర్ఎస్ ఇంఛార్జీగా నగేష్ ఉన్నారు. ఆయనకే అసెంబ్లీ సీటు దక్కుతుందని ఆశించారు. కానీ అనూహ్యంగా సీటు వేరే వారికి కేటాయించడంతో ఆయన ఖంగుతిన్నారు. గజ్జెల నగేష్ కే టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు ఆందోళనలు కూడా చేశారు. టిఆర్ఎస్ నిర్ణయం మార్చుకోకపోవడంతో ఆయన రెబల్ గా నామినేషన్ వేసి పోటిలో ఉన్నారు. దీంతో ఆయనను బహిష్కరిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.

షాద్ నగర్ నుంచి వీరపల్లి శంకర్ రెబల్ గా ఉన్నారు. షాద్ నగర్ టికెట్ అంజయ్య యాదవ్ కు కేటాయించారు. అంజయ్య యాదవ్ అభ్యర్ధిత్వాన్ని శంకర్ వ్యతిరేకించారు. తాము పార్టీ కోసం కృషి చేస్తే వేరే వాళ్లకు టికెట్ ఎలా కేటాయిస్తారని శంకర్ ప్రశ్నించారు. అందుకే తాను రెబల్ గా పోటిచేస్తానని ప్రకటించి బరిలో దిగారు. దీంతో అధిష్టానం ఆయన పై వేటు వేసింది.

మక్తల్ నుంచి చిట్టెం రామ్మోహన్ రెడ్డికి టిఆర్ఎస్ సీటు దక్కింది. ఈయన అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించిన అసమ్మతి నేతలు జలంధర్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. దీంతో జలంధర్ రెడ్డి రెబల్ గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో టిఆర్ఎస్ పార్టీ జలంధర్ రెడ్డిని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.
ఒకే రోజు నలుగురు అభ్యర్దులను బహిష్కరించడంతో పార్టీలో చర్చ జరుగుతోంది. నలుగురు కూడా దాదాపు ఎమ్మెల్యే అభ్యర్ధులు, కీలక నేతలు కావడంతో ఆయా నియోజకవర్గాల్లో గెలుపు పై ప్రభావం చూపుతుందోమోనన్న ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తోంది.
