టిఆర్ఎస్ కు వచ్చే సీట్లు ఇవే… రాములు నాయక్ జోస్యం

టిఆర్ ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో పచ్చి అబద్దాల మ్యానిఫెస్టో అని ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శించారు. కొత్త వాగ్డానాలతో ప్రజలను మోసం చేసేందుకు టిఆర్ ఎస్ బయలు దేరిందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించగానే 1200 మంది తెలంగాణ అమరుల ఆత్మ మంగళవారం నాడు వర్షం రూపంలో కురిసిందన్నారు.

నీళ్లు నిధులు, నియామకాలని చెప్పిన కేసీఆర్ పార్టీలో కొంత మందికి నిధులిచ్చారన్నారు. నియామకాలు ఎటుపోయాయో తెలియవన్నారు.  టిఆర్ ఎస్ అధికారంలోకి రావడం కల అన్నారు. 20 ఏళ్ల అనుబంధాన్ని 20 నిమిషాల్లో కేటిఆర్ బొందపెట్టారని విమర్శించారు.

తనను సీఎం తన్ని తరిమేయండి అని అన్నారని తనను తరమడం కాదు.. ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్ ని, టిఆర్ ఎస్ పార్టీని తన్ని తరుముతారని రాములు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని కిక్ ఆఫ్ అనడం దళిత, గిరిజన, బీసిలను అన్నట్టే అని యావత్ జాతి అంతా ఏకమయ్యి టిఆర్ ఎస్ ను తరమాలన్నారు.

ఎలాంటి షోకాజ్ నోటిసులు ఇవ్వకుండా అహంకారంతో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. మ్యానిఫెస్టోలో గిరిజనుల రిజర్వేషన్లు ఎటుపోయాయని నిలదీశారు. తండాలు, గూడెంలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నా పట్టించుకోలేదన్నారు. రెండు కులాల మధ్య గతంలో ఏ ముఖ్యమంత్రి చిచ్చుపెట్టలేదని, గోండులకు, లంబాడాలకు, యాదవులకు, కురుమలకు, బెస్తలకు ముదిరాజ్ లకు మధ్య చిచ్చు పెట్టిన మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు.

టిఆర్ ఎస్ కు 105 సీట్లు కాదు కదా 25 నుంచి 30 కి మించి సీట్లు రావన్నారు. టికెట్స్ ఇచ్చిన అభ్యర్దుల్లో 70 మంది కుంటి గుర్రాలే అని రాములు నాయక్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాట్లాడిన భాష సరిగా లేదన్నారు. ఆలే నరేంద్ర, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవరావు జాదవ్ చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించలేదు కానీ హరికృష్ణ చనిపోతే కుటుంబమంతా వెళ్లి స్మారక స్థూపాన్ని కట్టిస్తామని ప్రకటించారని దుయ్యబట్టారు.

రేపటి నుంచి తన పై భౌతిక దాడులతో పాటు ప్రెస్ మీట్ల దాడి జరుగుతుందని తనకు, కుటుంబ సభ్యులకు ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యతన్నారు. కాంగ్రెస్ నేతలను కలిశానని అబద్దాలు చెబుతున్నారు, తాను ఎవరితో కలిశానో నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయించుకుందాం అని సవాల్ విసిరారు. తనకు ఏ టికెట్ అవసరం లేదన్నారు. తనకు కావల్సింది గిరిజనులకు రిజర్వేషన్లన్నారు. పది ప్రభుత్వాలు చూసిన జైపాల్ రెడ్డిని విమర్శిస్తారా అని ప్రశ్నించారు.

మందకృష్ణ మాదిగ, ఆర్. కృష్ణయ్య తనతో చేతులు కలపాలని అప్పుడు అంతా కలిసి స్విచ్ ఆఫ్ చేద్దామన్నారు. నారాయణ ఖేడ్ లో తాను ఇండిపెండెట్ గా పోటి చేస్తానని, దమ్ముంటే భూపాల్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటి చేయాలన్నారు. తాను ఓడిపోతే ఉరివేసుకొని చనిపోతానని రాములు నాయక్ అన్నారు.