రేవంత్ రెడ్డి అనగానే ఘాటైన మాటలు, కొత్తరకం తిట్లు, ఎదురుదాడి, కేసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేయడం వరకే మనకు తెలిసిన ముచ్చట. పడనివారు రేవంత్ తీట మాటలు మాట్లాడుతాడని అంటారు. కేసిఆర్ ను విమర్శించడంలో తెలంగాణలో కరెక్టు లీడర్ రేవంతే అని ఆయన మనుషులు అంటారు. రేవంత్ రెడ్డి ప్లాన్ ఎ అంతా టిఆర్ఎస్ మీద, కేసిఆర్ కుటుంబం మీద పోరాటం చేశారు. మరి తాను చేపట్టబోయే ప్లాన్ బి ఎంటో తెలంగాణ జర్నలిస్టులు ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో వివరించారు.

ఆ ప్లాన్ బి అమలు చేయడం కోసం అవసరమైతే బాల్ థాక్రే పాత్ర అయినా, సోనియాగాంధీ పాత్ర అయినా పోశించేందుకు సిద్ధమన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాను నెంబర్ 2 హోదాలో ఉన్న తాను తన ప్లాన్ బి అమలు చేయించి తీరుతానని చెప్పారు. రేపు కూటమి అధికారంలోకి రాగానే ఏమేం పనులు చేయబోతామో, అధికారంలో ఉంటే ఏం చేయవచ్చో? వివరించారు రేవంత్ రెడ్డి. ఇంతకాలం ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన తాను రేపు అధికార పక్షంలో ప్రజల సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతానని అన్నారు. నేడు టిఆర్ఎస్ చేస్తున్న తప్పులు చేయబోమని హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో, కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 గా ఉన్న తన పాత్ర ఎలా ఉంటుందో వివరించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే చదవండి.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం టిఆర్ఎస్ నినాదం కానీ అది ప్రజల నినాదం కాదు. ఆత్మగౌరవం, సామాజిక న్యాయంతోనే తెలంగాణ ఉద్యమం సాగింది. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికే టిఆర్ఎస్ ఆ నినాదం ఎత్తుకుంది. నక్సలైట్ ఎజెండానే తన ఎజెండా అని చెప్పిన కేసీఆర్ ఇవాళ ఆ అజెండాను పాటించాడా అని ప్రశ్నిస్తున్నాను. తనకు ఒక్క సారి అవకాశం ఇస్తే బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్ తన ఇంటి వరకు బంగారు తెలంగాణ చేసుకున్నారు.
కేటిఆర్ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీని పట్టుకొని అమ్మ నా బొమ్మనా అని మాట్లాడిండు. రాహుల్ గాంధీని బఫూన్ అని మాట్లాడలేదా.. గడ్డాలు పెంచుకునేళ్లు సన్నాసులు అనడం సరికాదు. వాళ్లు వ్యక్తిగత దూషణలు దిగితే తప్పు లేదు కానీ రేవంత్ రెడ్డి మాట్లాడితే అతని మీద దూషణల పర్వం చేస్తున్నారు.

రాహుల్ సహా అందరి నేతలను కేసీఆర్ వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. తన కూతురు నిశ్చితార్ధానికి హాజరు కాకుండా మీరు చేసిన ప్రయత్నం అసలు మనిషన్నవాడు ఎవడైనా చేసే పనేనా… తన కూతురు నిశ్చితార్ధానికి హాజరుకాకుండా ఉద్దండులైన లాయర్లను తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా కుట్ర చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నాను. తన కూతురు నిశ్చితార్ధానికి హాజరు కాకుండా మూర్ఖుల లాగా తండ్రి కొడుకులు ప్రయత్నించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నాను.

రేవంత్ రెడ్డి ప్రజల తరపున పోరాడడమే కాదు. పరిపాలన అవకాశం వస్తే ఏ విధంగా పరిపాలన చేయాలో కూడా తెలుసు. తనకు అనుభవం లేదని కొంత మంది లేని పోని ఆరోపణలు చేస్తున్నారు. తనకు పరిపాలన అవకాశం వస్తే ఏ విధంగా ముందుకు పోవాలో తనకు తెలుసు. ఆనాడు రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ లు కూడా నేరుగా ప్రధాన పదవులు అందుకొని వారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో అందరికి తెలుసు.
వ్యవసాయం, విద్య వైద్యం, మౌలిక సదుపాయాలు, ప్రాథమిక అవసరాలు, పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తాం. జర్నలిస్టులు, ఆర్టీసీ, పోలీసులు వీరంతా కూడా సమాజాన్ని సరైన దిశలో పెట్టేందుకు పని చేస్తున్నవారు. వీరందరికి కూడా పాలనలో సరైన ప్రాధాన్యం కల్పిస్తాం. ఈ డిపార్ట్ మెంట్లలో పని చేసేవారంతా ఎప్పుడు పోతారో , ఎప్పుడు వస్తారో తెలియదు. వారి కుటుంబాలను కూడా పట్టించుకోకుండా వారికి వచ్చే వేతనాల కంటే ఎక్కువగా వారు శ్రమిస్తారు. అవసరమైతే 24 గంటల పాటు కూడా డ్యూటిలు చేస్తారు. సమయపాలన లేని పనులు చేస్తూ వారు సమాజ సేవకు అంకితమైతారు. వీరందరికి కూడా రాబోయే ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తాం. వారి శ్రమను గుర్తించి ప్రయోజనం అయ్యేలా వారిని గుర్తిస్తాం.

రైతుకు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం ద్వారా శాశ్వత పరిష్కారం
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటకుండా చూస్తాం
వ్యవసాయాన్ని లాభదాయకంగా చేస్తాం. రైతుల నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి దుకాణాలకు అందజేస్తుంది.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న యువత నిరుద్యోగం.. దీనిని పరిష్కారం కోసం అన్ని డిపార్ట్ మెంట్ల నుంచి డిసెంబర్ 31 వరకు నివేదిక తెచ్చుకొని పరీక్షలు నిర్వహించి జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం రోజు అందరికి ఒకే సారి అపాయింట్ మెంట్లు ఇస్తాం.. జనవరి నుంచే అన్ని ఖాళీలను భర్తీ చేస్తాం.
ప్రతి సంవత్సరం యూపీఎస్సీ మాదిరిగా క్యాలెండర్ వైస్ గా ప్రభుత్వ ఖాళీల భర్తీ చేస్తాం.
ప్రతి మండల కేంద్రం నుంచి గ్రామాలకు బిటి రోడ్ల నిర్మాణం చేస్తాం
ప్రతి మండల కేంద్రంలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణం, వీరికి నర్సింగ్ కాలేజి అటాచ్ చేస్తాం.
ఇరిగేషన్ శాఖలో సమూల ప్రక్షాళన చేస్తాం. 3 కేటగిరిలుగా తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.
మహిళలకు 25 శాతం చట్ట సభల్లో రిజర్వేషన్లు, మహిళల రక్షణ
ఆర్టీసీ, జర్నలిస్టులకు, పోలీసులు అందరి పిల్లలకు అందరికి కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 3 ప్రత్యేక అటానమస్ యూనివర్సిటి ఏర్పాటు చేసి అందరికి ఒకే దగ్గర చదువు చెప్పిస్తాం. అందరికి ఉచితంగా విద్యనందిస్తాం.
ఇవన్నీ రేవంత్ రెడ్డి గా చెబుతున్నాను. నేను సీఎం పదవి వస్తేనే ఇవన్నీ చేస్తానని అనడం లేదు. సీఎం పదవిలో ఎవరు ఉన్నా సరే వారితో నేను విషయాలను పంచుకొని తెలంగాణ బాగు కోసం కృషి చేస్తాను.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయం కేంద్రంగానే పరిపాలన సాగుతది. సచివాలయానికి మించిన మంచి వాస్తు స్థలం ఎక్కడైన ఉంటాదా. కొడుకు రాజకీయం కోసం సచివాలయానికి రాకుండా ఇంట్ల పండుకొని కేసీఆర్ రాజకీయం చేస్తుండు. ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి విధానం ఉందా.. సచివాలయం నుంచి పరిపాలన చేయడం రాజ్యాంగ హక్కు. దానిని కేసీఆర్ ఉల్లంఘించి నియంత పాలన చేస్తున్నాడు. ప్రజలందరికి మంచి పరిపాలన అందించడమే ప్రభుత్వ ద్వేయంగా పనిచేస్తాం.
