తెలంగాణ కాంగ్రెస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కారెక్కేందుకు సిద్దమయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు.
ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో ఇప్పటకే 8 మంది టిఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. అదే బాటలో మరికొంత మంది పయనిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి పారటీ మారతున్నట్టు వారు ప్రకటించారు. దీంతో వనమా వెంకటేశ్వరరావు కూడా సీఎంతో సమావేశమయ్యి కారెక్కేందుకు సిద్దమయ్యారు. దీంతో కాంగ్రెస్ లో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే మిగలనున్నారని చర్చ జరుగుతోంది.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నట్టు వనమా ప్రకటించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని ముక్తకంఠంతో బలపరిచారని, అత్యధిక మెజార్టీతో గెలిపించి రెండోసారి అధికారం కట్టబెట్టారని అన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం తన విధిగా భావిస్తున్నానని తెలిపారు.

కొత్తగూడెం నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే తనకు ముఖ్యమని.. సీఎం కేసీఆర్ అన్నివిధాలా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులను సంప్రదించాకే టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అవసరమైతే కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేస్తానని ప్రకటించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, జిల్లాను సస్యశ్యామలం చేయడానికి సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగూడెం జిల్లా ఏర్పాటు డిమాండ్ను కేసీఆర్ నెరవేర్చారని తెలిపారు.
