హైదరాబాద్ లో టిఆర్ఎస్ కు బిగ్ షాక్.. మూకుమ్మడి రాజీనామా

ఎన్నికలకు మూడు రోజుల సమయం ఉంది అనగా టిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కూకట్ పల్లి నియోజకవర్గ అభ్యర్ధి మాధవరం కృష్ణారావు ఒంటెద్దు పోకడలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మేడ్చల్ నేతలు తెలిపారు. 

కుతాడి రవికుమార్

మేడ్చల్ టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా కుతాడి రవి కుమార్ పని చేస్తున్నారు. గత కొంత కాలంగా పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. మాధవరం కృష్ణారావు పార్టీలో చేరిన తర్వాత కీలక నేతలకు గుర్తింపు లేదన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేశానన్నారు. రవితోపాటు.. కూకట్ పల్లి డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు ఖాదీర్, పోచయ్య, పల్ల కుమార్, అంజయ్య గౌడ్ ఇతర కీలక నేతలు టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. జిల్లా కీలక నేతలు రాజీనామా చేయడంతో కార్యకర్తలు ఖంగుతిన్నారు. ప్రచారంలో ముందుండి నడిపించి సడన్ గా వారు రాజీనామా చేయడంతో పరిస్థితి ఏంటని అంతా అయోమయంలో పడ్డారు. కుతాడి రవి కుమార్ తన రాజీనామా పై ఏమన్నారంటే…

“ఉద్యమ కాలం నుంచి పార్టీలో పని చేశాను. పార్టీలో తగిన గుర్తింపు లభించకపోయినా కేసీఆర్ మీద గౌరవంతో పని చేసుకుంటూ వచ్చాను. ఉద్యమ సమయంలో అరెస్టయ్యి జైలుకు కూడా వెళ్లి వచ్చాను. పార్టీ కోసం స్వంత డబ్బు ఖర్చు పెట్టి క్యాడర్ ను కాపాడుకున్నాను. మాధవరం కృష్ణారావు పార్టీలో చేరిన తర్వాత నుంచి పార్టీలో నాకు గౌరవం లేదు. ఎమ్మెల్యేగా ఉండడంతో అన్ని ఆయనే చూసుకునేవారు. మమ్ముల కనీసం పార్టీ కార్యకర్తగా కూడా గుర్తించలేదు.

అనేక సార్లు పలు కాంట్రాక్టు పనులు, ఇతరాత్ర విషయాల పై కూడా చర్చించిన కూడా తన అనుకూలురకు కాంట్రాక్టులు అప్పజెప్పాడు కానీ మమ్ముల పట్టించుకున్న పాపాన పోలేదు. మంత్రి కేటిఆర్ ని కలిసి కూడా విషయం చెప్పాం. నేను చెప్తాను… ఓపికగా ఉండండి. పరిస్థితులు సర్దుకుంటాయి అని చెప్పాడే తప్ప పరిష్కారం చూపించలేదు. కృష్ణారావుకంటే ముందు కూకట్ పల్లిలో కీలక నేతగా పని చేసి జిల్లా స్థాయి నేతగా ఎదిగాను. నాకు నామినేటేడ్ పదవి రాకుండా కృష్ణారావు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో ఈ విపత్కారాలు ఎక్కువయ్యాయి. టిఆర్ఎస్ లో ఇమడలేక రాజీనామాలు చేస్తున్నాను.” అని రవి కుమార్ తెలిపారు.

టిఆర్ఎస్ కు చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్సీ యాదవ రెడ్డి రాజీనామా చేశారు. ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు బుడాన్ బేగ్ కూడా రాజీనామా చేశారు. వీరి రాజీనామాల తర్వాత టిఆర్ఎస్ నుంచి చాలా మంది కీలక నేతలు బయటికి వచ్చారు. ఉద్యమ కాలంలో పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వకుండా తర్వాత వచ్చిన వారికే అధిక ప్రాధాన్యమిచ్చారని వీరంతా విమర్శించారు. ఓ వైపు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది టిఆర్ఎస్ నాయకులు రాజీనామా చేస్తుండడతో క్యాడర్ లోను, నేతల్లోను కలవరం మొదలైంది. ఏదేమైనా ఎన్నికలకు కొన్ని రోజుల ముందే కీలక నేతలు రాజీనామా చేయడం పార్టీలో, ప్రజల్లోను చర్చనీయాంశమైంది.