కెసిఆర్ సాబ్ ‘నిరుద్యోగ భృతి’ మరిచారా?

Nirudyoga Bruthi

కెసిఆర్ సాబ్ ‘నిరుద్యోగ భృతి’ మరిచారా?

తాయిలాలు నేరుగా లభ్దిదారుల బ్యాంకు ఖాతాలో జమపరిచే పథకాలకు ప్రస్తుత రాష్త్ర ప్రభుత్వాలు మొగ్గు చూపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, ఆసరా, నిరుద్యోగ భృతి వంటి పథకాలను ప్రవేశపెట్టింది.

ఆసరా పథకం ఇది వరకే అమలులో ఉండగా, రైతుబంధు పథకం మాత్రం రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లే కొద్ది నెలల ముందు ప్రవేశపెట్టింది TRS. ఇందులో భాగంగా రైతులకు ప్రతి ఎకరాకు అయిదు వేల రూపాయల సహాయం ప్రభుత్వం తరుపున నేరుగా రైతు ఖాతాలో జమచేయబడుతుంది.

2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో లో ప్రభుత్వం పై కోపం తో ఉన్న విద్యార్థులను తమవైపుకు తిప్పుకోవడానికి తెరాస ప్రభుత్వం ‘నిరుద్యోగ భృతి’ పథకం ప్రకటించింది. అయితే, ఈ పథకం కొరకు బుడ్జెట్ లో 1,810 కోట్ల కేటాయింపులు జరిగినప్పటికీ అమలులో తీవ్ర జాప్యం కనిపిస్తోంది. రాష్త్ర ప్రభుత్వం నూతన ఆర్ధిక సంవత్సరం నుండి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టాలనుకున్నప్పటికీ, కనీసం విధివిధానాలు కూడా ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల అవకపోవడం గమనార్హం.

ఇప్పటికే TSPSC ద్వారా లక్ష ఉద్యోగాలు కలిపిస్తామన్న హామీ నుండి వెనక్కి తగ్గిన ప్రభుత్వం పై చిర్రుబుర్రులాడుతున్న విద్యార్థులు, నిరుద్యోగ భృతి కూడా అమలుకు నోచుకోకపోవడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్త పరుస్తున్నారు. గత అయిదు సంవత్సరాలలో ప్రభుత్వ తీరు గమినిస్తే విద్యార్ధులకు ఎప్పుడు మొండె చెయ్యే చూపిందని…ఉద్యోగ కల్పనా, స్కాలర్షిప్ బకాయిలు చెల్లింపులలో అలసత్వం ప్రదర్శిస్తోందని..కెసిఆర్ కు విద్యార్థుల పట్ల వ్యక్తిగత కోపమేంటో అర్థంకావడం లేదని బీజేపీ నాయకుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

2014 లో వచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్ ఇంకా పూర్తి కావకపోవడం, TSPSC నిర్వహించే ప్రతి పోటీ పరీక్షా కోర్టు మెట్లు ఎక్కడం, 2018 జూన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తామన్న గ్రూప్-1 నోటిఫికేషన్ ఇంకా విడుదల కావకపోవడం, ఇంటర్మీడియట్ ఫలితాలలో అవకతవకలు..మరెన్నో పనులు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం తలుచుకుంటే పనులు త్వరగా సాగిపోవటం పెద్ద విశేశంకాదని, ఇది కేవలం విద్యార్థుల పట్ల ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష ధోరణేనని విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి.