హారీష్ రావు ఆవేదన అంతా ఒట్టి డ్రామేనని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి విరుచుకుపడ్డారు. టిఆర్ ఎస్ లో కేసీఆర్ పై అసంతృప్తులుగా ఉన్న వారిని దగ్గర చేసుకునేందుకే హరీష్ రావు డ్రామా ఆడుతున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర పై బహిరంగ చర్చకు సిద్దమా… అని ఎంపీ వినోద్ కు మధు యాష్కి సవాల్ విసిరారు. టైమ్, ప్లేస్ నువ్వే చెప్పు.. వచ్చేందుకు నేను రెడీ… మీరు రెడీనా అన్నారు.
ఆజాద్ వ్యాఖ్యలపై టిఆర్ ఎస్ ఎంపీ వినోద్ సోయిలేకుండా మాట్లాడుతున్నారని పదవులొద్దు అన్నటువంటి కేసీఆర్ సీఎం పదవిని ఎందుకు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రాల ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్ కు ఉంటుదన్న సోయిలేదా.. ప్రజల త్యాగాలను గుర్తించే సోనియా తెలంగాణ ఇచ్చిందని తెలియదా అని విమర్శించారు.
రెండు ఎంపీ స్థానాలతో తెలంగాణ తెచ్చామంటే ఇప్పుడు ఇంత మంది ఎంపీలుండి ఎందుకు మైనార్టీ రిజర్వేషన్ లు సాధించలేదన్నారు. వివేక్ నీవు నీ తమ్ముడి మెడికల్ కాలేజీల కోసం నన్ను ఎన్నిసార్లు బతిమాలిడినవో మరిచిపోయావా అని నిలదీశారు. ఆజాద్, జైరాం రమేష్ ల ఇంటి చుట్టూ ఎన్నిసార్లు చక్కర్లు కొట్టినవో మరిచిపోయావా అని నిలదీశారు.
కేసీఆర్ నిమ్స్ లో ఉన్నప్పుడు కేటిఆర్ కవితలు తనను కలిసి బతిమిలాడింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫాం హౌజ్ లో పడుకుంటే నాడు తెలంగాణ కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. నాడు నీది నీ తమ్ముడిది, కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంతో చెప్పాలన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదంటే టిఆర్ ఎస్ నేతలు పురుగులు పడి చస్తారన్నారు. కౌలు రైతు వెంకటేష్ ది ఆత్మహత్య కాదని కేసీఆర్ చేసిన హత్య అని దుయ్యబట్టారు. రైతులు అధైర్య పడొద్దని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.
కాళేశ్వరం రీడిజైన్ లతో కల్వకుంట్ల కంపుగా మారిందని కేసీఆర్ అబద్దాలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చారన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు రావు కానీ కవితకు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 2019లో సైలెంట్ విప్లవం రాబోతుందని టిఆర్ ఎస్ ను బొంద పెట్టడం ఖాయమన్నారు. జగన్ ఫోన్ చేస్తే రాయలసీమ కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. పద్మాలయ కేసును ఎందుకు ఉపసంహరించుకున్నారో హరీష్ రావు చెప్పాలన్నారు.
