టిఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల వేళ దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ పార్టీకి చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుడ్ బై చెప్పారు. పార్టీలో తనకు ప్రాదాన్యత లేదన్న కారణంగానే ఆయన పార్టీని వీడారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి మహేందర్ రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తనను చిన్నచూపు చూస్తున్నారని ఆయన గత కొంతకాలంగా ఆవేదనతో ఉన్నారు.
దీంతో విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. నాలుగు రోజుల క్రితం కేటిఆర్ బుజ్జగింపులు చేశారు. పార్టీని వీడతారని సర్వత్రా చర్చ జరిగింది. దీంతో కేటిఆర్ రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇద్దరు టిఆర్ఎస్ ఎంపీలు గోడ దూకబోతున్నారని, కేసిఆర్ కు దమ్ముంటే వాళ్లను ఆపుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి గత నాలుగు రోజుల కిందట చాలెంజ్ చేశారు. అప్పుడే కొండా విశ్వేశ్వర్ రెడ్డితోపాటు మహబూబాబాద్ ఎంపి సీతారాం నాయక్ పేర్లు బహిర్గతమయ్యాయి. ఆ సమయంలో వీరిద్దరూ ప్రగతి భవన్ కు వెళ్లి తాము పార్టీని వీడడంలేదని కేటిఆర్ కు వివరణ ఇచ్చారు. అయినా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాత్రం రేవంత్ చెప్పినట్లే పార్టీని వీడారు. రాజీనామా లేఖ కింద ఉంది చూడండి.



2014 ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంటు సీటులో కాంగ్రెస్ అభ్యర్థి కార్తీక్ రెడ్డి మీద గెలుపొందారు. కొన్ని రోజులుగా విశ్వేశ్వర్ రెడ్డికి మంత్రి మహేందర్ రెడ్డితో విబేధాలు నెలకొన్నాయి. ఆ విబేధాలు ముదిరి పాకాన పడడంతో విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడక తప్పలేదు. దీంతోపాటు ఎన్నికల విషయంలో అసెంబ్లీ సీట్ల కేటాయింపులో తన వర్గం వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని కొండా గుర్రుగా ఉన్నారు.

అంతేకాకుండా టిఆర్ఎస్ పార్టీలో నిఖార్సైన తన లాంటి నేతలకు, గౌరవంగా ఉండే నాయకులకు గుర్తింపు లేదని పలు సందర్భాల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన అనుచరులు, సన్నిహితుల వద్ద కామెంట్ చేస్తూ ఆవేదన వెలిబుచ్చినట్లు చెబుతున్నారు. తాను ఆస్తులు సంపాదించుకోవడానికో, లేదంటే పేరు కోసమే రాజకీయాల్లోకి రాలేదని కొండా పలు సందర్భాల్లో కామెంట్స్ చేశారు. తరతరాలుగా తమ ఫ్యామిలీ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తోందని ఆ వారసత్వం కొనసాగించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన చెబుతూ ఉండేవారు.
తన తాత రాజకీయాల్లో చేసిన సేవలకు గుర్తుగా తన తాత కొండా వెంకట రంగారెడ్డి పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లా ఏర్పాటైన విషయాన్ని ఆయన తన సహచరుల వద్ద గుర్తు చేసుకున్నారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన తమకు టిఆర్ఎస్ లో ఏమాత్రం గౌరవం దక్కలేదని మదనపడ్డారు. తన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దక్కలేదు కాబట్టే టిఆర్ఎస్ ను వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

మంగళవారం తన రాజీనామా విషయమై మూడు పేజీల లేఖను కేసిఆర్ కు రాశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. లేఖలో ఐదు అంశాలను కొండా వెల్లడించారు. తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఆ లేఖలో వివరించారు. కేటిఆర్ బుజ్జగింపులేమీ పనిచేయలేదు అని తేలిపోయింది. తనను పార్టీలో బలహీనపరిచారని కొండా ఆవేదనను వెలిబుచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన కొండా ఎంపి పదవి కి కూడా రాజీనామా చేయనున్నట్లు లేఖలో వివరించారు.
టిఆర్ఎస్ కు కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. టిఆర్ఎస్ ను ఆందోళనకు గురిచేసిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఎన్నికల తరుణం ముంచుకొస్తున్నవేళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ చెప్పినట్లుగా మరో ఎంపి కూడా రాజీనామా చేస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే మహబూబాబాద్ ఎంపి సీతారాం నాయక్ కూడా టిఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఆయన తానేమీ పార్టీని వీడబోనని ప్రకటించారు. కేటిఆర్ కు కూడా అదే వివరణ ఇచ్చారు.
అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీని వీడబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూనే పార్టీకి గుడ్ బై ప్రకటించారు. మరి ఈయనలాగే మాట్లాడిన మరో ఎంపి ప్రొఫెసర్ సీతారాం నాయక్ కూడా రేపో మాపో గుడ్ బై చెబుతారా? లేదంటే టిఆర్ఎస్ లోనే కొనసాగుతారా అన్నది చర్చనీయాంశమైంది. మరోవైపు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కూడా పార్టీని వీడుతారని చర్చ జరిగింది. మరి ఆయన విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే తెలంగాణకు ఆంధ్రకు బార్డర్ లో ఉన్న ఒక ఎంపి కూడా పార్టీకి గుడ్ బై చెప్పవచ్చని టాక్ నడుస్తోంది. ఆయన మీద ఇటీవల ఐటి దాడులు కూడా జరిగాయి. ఆయన ఇలాకాలో తన వర్గానికి టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని గుర్రుగా ఉన్నట్లు విమర్శలు వినిపించాయి. మరి ఈ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
