భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అందరి అంచనాలను తారుమారు చేసి వెళ్లాడు. అమిత్ షా కెసిఆయర్ జోలికి అసలు వెళ్లడని, ఈ మేరకు కెసిఆర్ కు, ప్రధాని మోదీకి ఒప్పందం కూడా కుదరిందని, అందులో భాగమే ముందస్తు ఎన్నికలని మీడియా పండితులంతా ప్రచారం చేశారు. అయితే, అమిత్ షా రావడం రావడమే..కెసిఆర్ మీద బుసకొట్టడం మొదలుపెట్టారు. ఆయన మాట్లాడిన ప్రతిచోట కెసిఆర్ అవినీతిని, కుటుంబ పాలనని, ఆయన విస్మరించిన హామీలను, తెలంగాణ విమోచన దినం… చివర ముందస్తు ఎన్నికలను.. ఒకటేమిటి అన్నింటి ప్రస్తావించి ముఖ్యమంత్రి కెసిఆర్ మీద తీవ్రంగా విరుచుకు పడ్డారు.
అయితే, ఇంకా ముఖ్యమంత్రి కెసిఆర్ తనదైన శైలిలో స్పందించలేదు. కాని, కుమారుడు ఐటి మంత్రి కెటిఆర్ మాత్రం ఎప్పటిలాగే ట్వీట్ వదిలారు. భారతీయ జనతాపార్టీని ఆయన ఝూఠా పార్టీ అన్నారు. తర్వాత అమిత్ షాను భ్రమిత్ షా అని వర్ణించారు.
అయితే, కేసియార్ భాష, కెటిఆర్ భాష వినివిని ప్రతిపక్ష పార్టీలు కూడా అదే భాష నేర్చుకుంటున్నాయి. కెసియార్ కి ఆయన భాషలో జవాబిచ్చేందుకు చూస్తున్నాయి. కెసియార్ కు ఆయన భాషలోనే సమాధానమిస్తామని ఆ మధ్య పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన కూడా చేశారు. ఇపుడు అలా బయటకు అనకుండానే బిజెపి నేత జి కిషన్ రెడ్డి ఐటి కెటిఆర్ కు అదే భాషలో సమాధానమిచ్చారు.
అమిత్ షా భ్రమిత్ షా అయితే, బిజెపి ఝూఠా పార్టీ అయితే, టిఆర్ ఎస్ ఏమవుతుంది?
‘తెలంగాణ రజాకార్ల సమితి’ అన్నాడు కిషన్ రెడ్డి.
ఇంత షార్ఫ్ గా ఇంతవరకు కెటిఆయర్ కు ఇలా సమాధానమిచ్చిన వారు లేరు.
కిషన్ రెడ్డి మాట బాణంలా దూసుకుపోయింది. టిఆర్ ఎస్ అంటే, తెలంగాణ రాష్ట్ర సమితి లాగా తెలంగాణ రజాకార్ల సమితిఅనే మాటకూడ పాపులర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణాలో రజకార్ అనే మాట చాలా పాపులర్ తిట్టు. అరవైయేళ్లుగా జనంనోట నానుతూ వస్తున్న మాట. అందుకే టిఆర్ ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సమితి అని అనడం అతికినట్లు సరిపోయింది
