మోదీని తిరిగి ప్రధానిని చేసేందుకు సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. శుక్రవారం సాయంత్రం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సంధర్బంగా భట్టి విక్రమార్క సీఎం పై ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే…
“బిజెపికి టీం గా ఉన్న ఎంఐఎం తన విధానమేంటో చెప్పాలి. తెలంగాణను దాటితే కేసీఆర్ ను పలకరించే దిక్కు లేదు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ తన మాటల ద్వారా తప్పుదోవ పట్టిస్తున్నారు. తాను పాడిందే పాట.. ఆడిందే ఆట అన్నటువంటి చందంగా వ్యవహరిస్తున్నారు.
అటువంటి కేసీఆర్ కు 16 సీట్లు కట్టపెట్టాలట. ఆయన దేశానికి దశ నిర్దేశం చేస్తారట. ఎమ్మెల్యేలను కొని ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారు. అటువంటి కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాలి. కేసీఆర్ చెప్పుడు మాటలు వినేందుకు ప్రజలు అమాయకులు కాదు.
ఇప్పటికే ప్రజలకు కేసీఆర్ తీరు అర్ధమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయం టిఆర్ఎస్ పతనానికి నాంది” అని భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, గండ్ర వెంకటరమణారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
