జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ వార్తల్లోకెక్కారు. కాస్త తీరిక చూసుకుని మళ్ళీ హైద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు. రాజకీయాల్లో అతిథి పాత్ర పోషించడం పవన్ కళ్యాణ్కి అలవాటే. అలా అతిథి పాత్ర పోషించేందుకు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి, ఓ ఇంట్రెస్టింగ్ డైలాగ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయన్నది ఆ డైలాగ్. స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారోగానీ, పవన్ కళ్యాణ్ నాలుగైదు పవర్ ఫుల్ డైలాగులు పేల్చేశారు.
సిద్ధాంత బలం వుండబట్టే జనసేన పార్టీ నిలదొక్కుకోగలిగిందనేది అందులో ఓ డైలాగు. ఇంకోటి, పైన చెప్పుకున్న ‘వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్ల’ డైలాగు. మరొకటి, జనసేన పార్టీ జెండా ఖచ్చితంగా ఎగిరి తీరుతుందనీ, అధికార పీఠమెక్కుతామనీ జనసేనాని వ్యాఖ్యానించడం.
అదిరిందయ్యా పవన్ కళ్యాణూ.! వైసీపీ లెక్కలు చెప్పినవ్ బాగానే వుంది.. జనసేన లెక్కలు చెప్పవేంటీ.? అని నెటిజనం ప్రశ్నిస్తున్నారు. ఔను కదా, ఏ రాజకీయ పార్టీ అయినా, తాము ఎన్ని సీట్లలో గెలవబోతున్నామన్నదానిపై ఓ ఖచ్చితమైన అవగాహనతో ముందుకు వెళుతుంది కదా.? మరి, జనసేన అంచనాలేంటి.?
ఆ ఒక్కటీ మాత్రం జనసేనాని చెప్పరు. ఎందుకంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఒంటరిగా ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో ఖచ్చితంగా చెప్పలేరు గనుక. ఇదే విషయమై వైసీపీ గతంలోనూ ర్యాగింగ్ చేసింది. అయినా, జనసేన మాత్రం పెదవి విప్పలేదు.
వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో జనసేనాని, జనసేన శ్రేణులకు తద్వారా రాష్ట్ర ప్రజలకూ చెప్పారు. అలాగే ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుందో కూడా పవన్ కళ్యాణ్ చెప్పాలి.. పార్టీ శ్రేణులకే కాదు, ప్రజలకు కూడా. ప్రజలకు చెప్పినా, చెప్పకపోయినా.. కనీసం జనసేన శ్రేణులకైనా పవన్ కళ్యాణ్ ఈ విషయమై స్పష్టతనివ్వాలి కదా.?
