Ys Jagan Shocking Statement : తెలుగుదేశం పార్టీ గుర్తు.. అనగానే, ఎన్నికల గుర్తు సైకిల్ గురించే అనుకుంటే అది పొరపాటే. ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తావించింది తెలుగుదేశం పార్టీ గుర్తు.. అదేనండీ, ఓ గుడిసె.. నాగలి.. ఇవన్నీ వుండే పార్టీ గుర్తు గురించి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మీద ఎడా పెడా సెటైర్లు వేసేశారు. అందులో, టీడీపీ గుర్తు మీద వైఎస్ జగన్ వేసిన సెటైర్ భలేగా పేలింది.
తెలుగుదేశం పార్టీ గుర్తులో ‘గుడిసె’ వుంటుంది. అంటే, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం.. పేదవాడు ఎప్పటికీ గుడిసెలోనే వుండాలని. మా ప్రభుత్వం పేదలందరికీ మంచి ఇళ్ళు నిర్మించాలని అనుకుంటోంది. ఈ మేరకు ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించాం.. అంటూ వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ( Ys Jagan Shocking Statement)
అయితే, టీడీపీ గుర్తు స్వర్గీయ నందమూరి తారకరామారావు హయాంలో రూపొందింది. అసలు పార్టీ గుర్తుల్ని పట్టుకుని ఇలాంటి విమర్శలు చేయడమేంటి.? అంటూ వైఎస్ జగన్ మీద టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
రాజకీయాల్లో అంతే. రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించే క్రమంలో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు రాజకీయ నాయకులు. అయితే, అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి చర్చ జరగడం ఎంతవరకు సబబు.? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.
ఏదిఏమైనా, వైఎస్ జగన్ వేసిన పంచ్ డైలాగులు మాత్రం సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయ్. వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి వైఎస్ జగన్ పేల్చిన వాగ్బాణాలు.