వైఎస్ జగన్ అత్యాశ: 175 సీట్లూ కొల్లగొట్టేస్తే పోలా.?

Ys Jagan Targets Total 175

Ys Jagan Targets Total 175 :  2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 22 లోక్ సభ నియోజకవర్గాల్లో ‘ల్యాండ్ స్లైడ్ విక్టరీ’ కొట్టగలిగిందంటే, ఆనాటి పరిస్థితులు వేరు. ప్రత్యేక హోదా అంశాన్ని అప్పటికి చంద్రబాబు పాతరేశారు, ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొత్త నాటకమాడారు.. అంతలోనే, మాట మార్చి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేశారు. పూటకో మాట మార్చి చంద్రబాబు తమను నిండా ముంచేశారన్న భావనకు వచ్చేశారు రాష్ట్ర ప్రజానీకం. రాజధాని అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించి.. సరైన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని మార్చారనే విమర్శలు చంద్రబాబుపై అప్పట్లో ప్రజల నుంచి గట్టిగా వినిపించాయి. ఆ ప్రజా వ్యతిరేకత కాస్తా, చంద్రబాబు సర్కారుని దించేసి, ఆ క్రమంలో వైసీపీకి బంపర్ మెజార్టీని కట్టబెట్టింది.

అప్పటికీ, ఇప్పటికీ ఏం మారిందని.? చంద్రబాబు హయాంలోనే నయం.. అమరావతి పేరుతో కొన్ని పనులైనా రాజధానికి సంబంధించి జరిగాయి. మరి, వైసీపీ హయాంలో ఏం జరిగింది.? చంద్రబాబు హయాంలో మొదలైన రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఆగిపోయాయ్. మూడేళ్ళ తర్వాత కోర్టు మొట్టికాయలతో మళ్ళీ పనులు మొదలయ్యాయ్. ఆ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంగా మొలిచిన తుప్పల్ని తొలగించడానికే రెండేళ్ళ సమయం పడుతుందేమో.!

పోలవరం ప్రాజెక్టూ పూర్తి కాలేదు. కేంద్రం మెడలు వంచి వైఎస్ జగన్ తీసుకొస్తానన్న ప్రత్యేక హోదా కూడా సాధ్యం కాలేదు. చంద్రబాబు హయాంలోనే ప్రకటితమైన ప్రత్యేక రైల్వే జోన్ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కడపలో వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన స్టీలు ప్లాంటుకి దిక్కు లేదు సరికదా, విశాఖలో వున్న స్టీలు ప్లాంటుని కేంద్రం ప్రైవేటీకరణ చేసేస్తోందాయె. రాస్తే ఇదొక పెద్ద పురాణమే అవుతుంది మరి.! పురాణం కాదిది, రాష్ట్ర ప్రజల ఆవేదన.

అయినాగానీ, 2019 ఎన్నికల కంటే పెద్ద మెజార్టీతో విజయం సాధించేస్తామనే ధీమా 2024 ఎన్నికల విషయమై వైసీపీ వ్యక్తం చేస్తోంది. ఇంతలోనే 50 శాతానికి పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందంటూ వైసీపీ నుంచే లీకులు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగానే వున్నారట.. కానీ, ప్రజా ప్రతినిథులే సరిగ్గా పని చేయడంలేదట. అలాగని వైసీపీనే పరోక్షంగా అంగీకరిస్తున్న పరిస్థితి.

‘మొత్తం 175 సీట్లూ గెలుచుకోవాలన్న దిశగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. అదే విషయాన్ని తాజాగా వైసీపీ ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ జగన్ చెప్పారు..’ అంటూ వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు.. అన్నిటికీ మించి సకల శాఖల మంత్రిగా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. సాధ్యమయ్యే పనేనా ఇది.? అంటే, అదంత తేలికైన వ్యవహారం కాదు. నిజానికి, 151 సీట్లను నిలబెట్టుకోవడమే వైసీపీ ముందున్న అతి పెద్ద టాస్క్. రెండోసారి వరుసగా అధికారంలోకి వచ్చేందుకు 100 సీట్లు అయినా సరిపోతాయ్.. అనుకునే స్థాయికి వైసీపీలో చర్చ జరుగుతోందిప్పుడు.

చేసే పనులకీ, చెప్పే మాటలకీ పొంతన లేదని, అప్పుల విషయంలోనే నిరూపితమయిపోయింది. అయినాగానీ, వైసీపీ నుంచి ఇంకా ఈ తరహా మభ్యపెట్టే ప్రకటనలు, పార్టీ పట్ల సొంత పార్టీ నాయకులకే విశ్వాసం లోపించేలా మారుతుందన్నది రాజకీయ పరిశీలకుల వాదన.