Ys Jagan : జనం ముందు మళ్ళీ వెళ్ళి ఓట్లు అడగాల్సి వచ్చినప్పుడు మద్య నిషేధం గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత ఏం సమాధానం చెబుతారు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రత్యేక హోదా, రాజధాని.. ఇలా చాలా విషయాల్లో వైఎస్ జగన్ పూర్తి గందరగోళంలో వున్నారు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి.
పైకి కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నా, తెరవెనుకాల ఆయన చాలా మనోవేదన అనుభవిస్తున్నారనే వాదనల్ని తేలిగ్గా కొట్టిపారేయలేం. ఎందుకంటే, మాట తప్పను.. మడమ తిప్పనంటూ రాజకీయాల్లోకి వచ్చారాయన. అధికారంలోకి వచ్చాక ప్రతి విషయంలోనూ మాట తప్పాల్సి వస్తోంది, మడమ తిప్పాల్సి వస్తోంది.
మద్య నిషేధం విషయంలో అయితే పరిస్థితి మరీ దారుణం. ఐదేళ్ళలో దశల వారీగా మద్య నియంత్రణ అమలు చేసి, చివరికి మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని ప్రకటించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో. కానీ, ఇప్పుడు ఆ మద్యం అమ్మకాలు లేకపోతే, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితి వస్తుందంటున్నారాయన.
సో, మద్య నిషేధం అమలయ్యే అవకాశమే లేదన్నమాట. ఇంకోపక్క సీపీఎస్ రద్దు విషయంలోనూ మాట తిప్పుడు, మడమ తిప్పుడే.! సీపీఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన వైఎస్ జగన్, మూడేళ్ళయినా ఆ పని చేయలేకపోయారు. మంత్రులేమో సీపీఎస్ రద్దు అసాధ్యమని తేల్చేస్తున్నారు.
మాట ఇస్తే, ఆ మాట మీద వైఎస్ జగన్ నిలబడతారన్న అంశం చుట్టూనే ‘విశ్వసనీయత’ వస్తుంది. ఆ విశ్వసనీయత విషయంలో చంద్రబాబు మైనస్ మార్కులేయించుకుంటే.. మరిప్పుడు వైఎస్ జగన్ చేస్తున్నదేంటి.?
